నోటుకు ఓటు: వేం నరేందర్ రెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఆయనే అని అంటున్నారు. దీంతో దర్యాప్తు అధికారులు ఆయనపైనే ప్రధానంగా దృష్టి సారించారని చెబుతున్నారు.
ఆయన కుమారుడు కృష్ణకీర్తన్ను వరుసగా రెండు రోజులు విచారించిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయన డ్రైవర్ చిన్న, పని మనిషి అర్జున్, కేబుల్ ఆపరేటర్, సహాయకుడు వీరభద్రంలను ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారం నడిచిన సమయంలో వేం ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారు? ఇంటికి ఎవరెవరు వచ్చారు? అనే అంశాలపై వేర్వేరుగా సమాచారం సేకరించారు.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్లో ఎవరు ఎక్కువగా వేం నరేందర్ రెడ్డి ఇంటికి వచ్చిపోతుండేవారు, ఎక్కడ కలుసుకుని మాట్లాడుకునేవారు వంటి అంశాలపై ఆరా తీశారు. కృష్ణ కీర్తన్ తండ్రి రాజకీయ విషయాల్లో కలుగజేసుకునేవారా? రేవంత్తో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశమున్నట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు ఇంతకు ముందు ప్రశ్నించి వదిలేశారు. మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. వేం నరేందర్ రెడ్డిపై తగిన సాక్ష్యాధారాలు సేకరించాలని, ఆ తర్వాత ఆయనను మరోసారి విచారణకు పిలువాలని ఎసిబి అనుకుంటున్నట్లు సమాచారం.