కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు, ఆ క్యాన్సర్ మనకొద్దు: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్లో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
వారంతా రాజకీయ సభలు పెట్టుకుంటే.. మనం మాత్రం..: కేసీఆర్
మిగితా పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయని.. అయితే తాము మాత్రం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామన్నారు సీఎం కేసీఆర్. ఇదే వాళ్లకీ తమకు ఉన్న తేడా అని చెప్పారు. రాష్ట్రంలో వైద్య విధానాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు. టిమ్స్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అల్వాల్ టిమ్స్ లో ప్రసూతి సేవల ప్రత్యేక విభగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా లాంటి వైరస్ లు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో వైద్య సదుపాయాలను పెంచుతున్నట్లు తెలిపారు. కేవలం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ పైనే ఆధారపడకుండా నగరానికి నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణే బెటర్.. హైదరాబాద్ ఫార్మా సిటీ
ఏడేళ్లలో హైదరాబాద్లో దాదాపు రూ.2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. సుమారు 10, 15లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికినయ్. రేపు హైదరాబాద్లో సిటీలో 14వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మాసిటీ తేబోతున్నాం. జీనోమ్వ్యాలీలో తయారవుతున్న వ్యాక్సిన్లతో ప్రపంచానికే రాజధానిగా ఉన్నాం. ప్రపంచంలోనే 33శాతం టీకాలు తయారీ కేంద్రం హైదరాబాద్ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అనేక కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ సంస్థలను ప్రారంభిస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రశాంత వాతావరణమే ఇందుకు కారణమన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందుందని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కోతలున్నాయని.. మన రాష్ట్రంలో మాత్రం నిరంతరం విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.
కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు: ఆ క్యాన్సర్ మనకొద్దంటూ కేసీఆర్
అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని, కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అది క్యాన్సర్ జబ్బులాంటిదని.. ఒకసారి వస్తే చాలా ప్రమాదకరమన్నారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని హెచ్చరించారు. కులమతాల పేరుతో రాజకీయాలు చేసేవారిని ప్రజలు గమనించాలన్నారు. మనదేశానికి చెందిన సుమారు 13 కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారని.. అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపితే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అని ప్రశ్నించారు. మతం, కులం పేరుతో కోట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని అన్నారు. అలాంటి క్యాన్సర్ మన దగ్గర తెచ్చుకోవదని కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా ప్రజలకు ఈ విషయాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.