రేవంత్ సర్కారుపై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు, కేంద్రానికి కీలక సూచన
దేశంలో జనాభా లెక్కలతోపాటు కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దేశంలో కులగణన అత్యవసరమని 2021 నుంచి తాను ఈ అంశాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఒవైసీ తెలిపారు. రానున్న జనగణనలో కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
బీజేపీ నిజాయతీగా ఉండాల్సిన అవసరం ఉందని, సేకరించిన వివరాలను పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యంత వెనకబడి వర్గాలకు విద్యా, ఉపాధిలో న్యాయమైన వాటా లభించాలన్నారు అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణలో చారిత్రక కులగణన చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తెలంగాణలో చేసిన కులగణన మొదటిదని ఒవైసీ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో బీసీల జనాభా 56.32 శాతంగా ఉన్నట్లు తేలిందని.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకొందని ప్రశంసించారు. ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నారని వెల్లడిస్తున్నాయని అసదుద్దీన్ తెలిపారు. దళిత ముస్లింలకు ఎస్సీ హోదాను బీజేపీ వ్యతిరేకించిందని, వెనకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకించిందన్నారు.
కుల గణన ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న రాహుల్
జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపడతామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్రం చేపట్టే కులగణనకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. అయితే, కులగణనకు నిర్ణీత సమయం తెలపాలని కోరుతున్నామన్నారు.
తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ ఇందుకు బ్లూప్రింట్గా నిలుస్తుందని రాహుల్ చెప్పుకొచ్చారు. కులగణన సమనత్వం తీసుకొస్తుందన్నారు రాహుల్. ఇది తొలి మెట్టేనని.. కులగణనకు అందరి భాగస్వామ్యం కూడా అవసరమని వ్యాఖ్యానించారు. కులగణనకు తెలంగాణ ఓ మోడల్గా నిలుస్తుందని రాహుల్ అన్నారు. అంతేగాక, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
జనాభా లెక్కలతోపాటు కులగణన
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తదుపరి జనాభా లెక్కలను నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాక, జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీన్ని చేర్చుతామని కేంద్రం పేర్కొంది.
ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. కాగా, 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగని విషయం తెలిసిందే.
కాగా, గత కొంత కాలంగా విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు, దేశంలో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేసేందుకు నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications