నా బిడ్డను ప్రణయ్కి ప్రతిరూపంగా చూసుకుంటా, వాళ్లని దారుణంగా చంపాలి: అమృత
నల్గొండ: తన భర్త పెరుమాళ్ల ప్రణయ్కి ప్రతిరూపంగా తన బిడ్డను చూసుకుంటానని అమృత తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్యకు సంబంధించిన అమృత పలు సంచలన విషయాలను వెల్లడించారు. కొందరు నాయకుల పేర్లను కూడా వెల్లడించింది.
నాన్నను చంపేస్తా: ప్రణయ్ మృతదేహం చూసి భోరుమన్న అమృత, 'మారుతీరావు కబ్జాకోరు'
వారిని దారుణంగా చంపాలి..
పరువు, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదని.. వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ‘ప్రణయ్ హత్యలో ఎంతమంది ఉన్నారో.. వారిని దారుణంగా చంపాలి. వాళ్లను ఉరితీయొద్దు.. అతి దారుణంగా చంపితేనే అది చూసి ఎవరూ ఇలాంటి హత్యలు చేయకుండా ఉంటారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యే' అని అమృత కంటతడిపెట్టారు.
నా బిడ్డను ప్రణయ్కి ప్రతిరూపంగా..
‘ప్రాణాలు తీస్తారని ప్రణయ్ భయపడేవాడు కాదు. నాకు నిత్యం తోడుగా ఉంటూ చాలా ధైర్యం చెప్పేవాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రణయ్ అంటే నాకు ఎంత ఇష్టమో అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. నేను వారి వద్దనే ఉంటా. నాకు పుట్టే బిడ్డను ప్రణయ్కి ప్రతిరూపంగా చూసుకుంటా' అని అమృత తెలిపింది.
నిందితులు వీరే..
ప్రణయ్ హత్యలో తన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ కుమార్, టీఆర్ఎస్ నేత, న్యాయవాది భరత్ కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారవేత్తలు రంగా శ్రీకర్, రంగా రంజిత్ ఉన్నట్లు అమృత వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులను తొందరగా శిక్షించాలని తెలిపింది.
వాళ్లు పిలిస్తే వెళ్లలేదు
‘వివాహం చేసుకున్న తర్వాత వీరేశం నన్ను, ప్రణయ్ని పిలిస్తే వెళ్లలేదు. అంతకుముందు రోజు నల్గొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయాన్ని పత్రికల్లో చూసి వెళ్లలేదు. అందుకే కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి బాలస్వామిపై ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని కేసు పెట్టించారు. ఆయన ఎల్ఐసీ ఏజెంట్ కాకపోవడంతో మేము ఐజీ వద్దకు వెళ్లాం. ఆ తర్వాత ఎస్పీని కలిసి పూర్తి వివరాలు చెప్పాం' అని అమృత అంతకుముందు జరిగిన పరిణామాలను వివరించారు.
నమ్మించి ప్రణయ్ని చంపారు..
తన అన్న ప్రణయ్ని చంపిన మారుతీరావు జైలులోనే చవాలని.. బయటికొస్తే.. ప్రజలే చంపుతారని ప్రణయ్ సోదరుడు అజయ్ అన్నారు. ప్రణయ్.. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తున్నాడని చెప్పారు. అమృతతో ఆమె తల్లి ఫోన్లో మాట్లాడేదని, అలా నమ్మించి ప్రణయ్ని చంపారని కన్నీటిపర్యంతమయ్యాడు. హత్యకు ముందురోజు వినాయక చవితినాడు తనతో ప్రణయ్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పారు. అన్న, వదినలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని తెలిపారు. ప్రణయ్ని దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అజయ్ అన్నారు.
అమృతను కూతురులా చూసుకుంటా.. కానీ
మారుతీరావు నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా కొడుకు ప్రణయ్ని చంపి తన కూతురిని తీసుకెళ్లాలనుకున్నాడు. అమృత అతని వద్దకు వెళ్లనంటోంది. మా వద్దనే ఉన్నా మా కూతురులా చూసుకుంటాం. కానీ, ఆమెను తీసుకెళ్లడానికి నన్ను కూడా చంపుతాడు. మారుతీరావు, శ్రవణ్ కుమార్లను శాశ్వతంగా మిర్యాలగూడ నుంచి బహిష్కరించాలి' అని బాలస్వామి కోరారు.
ఇంత దారుణానికి ఒడిగడతారనుకోలేదు..
‘తన కొడుకు అమృతను ప్రేమించిన నాటి నుంచే ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రణయ్ కళాశాలకు వెళ్లకుండా పరీక్షలు రాశాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా వారిద్దరూ మంచిగా ఉండేవారు. ఇటీవల అమృతతో ఆమె తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పేవాడు. వారి కోపం తగ్గిందని భావించాం. కానీ నమ్మించి ఇలా చంపుతాడనుకోలేదు' అని బాలస్వామి కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్ తోపాటు మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.