తెలంగాణాపై సీబీఐ,ఈడీ ఫోకస్; గులాబీ నేతలను అలెర్ట్ చేస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ టాక్స్ విభాగాలు ఫోకస్ పెట్టాయా? తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తెలంగాణ సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నేతలకు చెక్ పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించుతుందా? ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు అందుకు ఊతమిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
తెలంగాణాపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ పెట్టాయని పేర్కొని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో ఇన్నాళ్లు పనిచేసినట్టుగా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
పార్టీ నేతలను అలెర్ట్ చేసిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇక తాజా భేటీలో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ టాక్స్ విభాగాలు హైదరాబాదులోని పలు సంస్థలలో దాడులు చేస్తున్నాయని, ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ వారికి సూచించినట్టు తెలుస్తుంది.
టీఆర్ఎస్ ను మోడీ సర్కార్ టార్గెట్ చేస్తుందని జాగ్రత్తలు చెప్పిన గులాబీ బాస్
అవినీతి ,అవకతవకలు, కుంభకోణాలలో ఇరుక్కోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారని సమాచారం. కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అయిన బీజేపీ ని టార్గెట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న నేపథ్యంలో గులాబీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని మోడీ సర్కార్ ఎదురు చూస్తోందని, కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోందని తన పార్టీ నేతలను సీఎం కేసీఆర్ అలెర్ట్ చేసినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ కొనసాగుతుంది.
పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకోండి
ఇక పోలీసులు సైతం కుట్రపూరితంగా వ్యవహరించే వారిపై, రాష్ట్రంలో విద్వేషాలను రగిల్చే వారిపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇక బండి సంజయ్ పాదయాత్రతో కొనసాగుతున్న అలజడిపైన కూడా కెసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడినట్టు సమాచారం . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించుకున్న ప్రగతిని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎలాంటి కాంట్రవర్సీ లలోనూ ఎవరు తలదూర్చకూడదని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.