బ్యాంకులకు టోకరా: రిసార్ట్స్ అధినేతపై సిబిఐ కేసు
హైదరాబాద్: వివిధ బ్యాంకులకు వందలకోట్ల రుణం ఎగ్గొట్టిన లియోనియా రిసార్ట్స్ అధినేత చక్రవర్తిరాజు అక్రమాలపై సిబిఐ కొరడా ఝళిపించింది. విక్రయించిన ప్లాట్లను తనవిగా చూపుతూ బ్యాంకులవద్ద కుదువపెట్టి వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. 11 బ్యాంకులకు రూ.530 కోట్లు రుణం ఎగ్గొట్టిన వ్యవహారంపై బెంగళూరు సీబీఐ అధికారులు చక్రవర్తిరాజుపై సోమవారం కేసు నమోదుచేశారు. ఐపీసీ సెక్షన్ 120 (బీ), రెడ్ విత్ 420, 467, 468, 471 కింద అభియోగాలు మోపారు.
కుట్రపూరితంగా వ్యవహరించడం, డాక్యుమెంట్ల ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తప్పుదారి పట్టించినట్టు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలో 65 ఎకరాల స్థలంలో 14 మంది రైతులతో ఏజీపీఏలు చేసుకొని చక్రవర్తిరాజు లియోనియా రిస్టార్స్ పేరుతో దందా ప్రారంభించారు. ఈ భూములను ప్లాట్లుగా అమ్మి వాటిపైనే బ్యాంకుల్లో కోట్ల రుణాలు పొందారు. రుణం కోసం ఒక సర్వే నంబర్ను చూపి మరో సర్వే నంబర్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు సీబీఐ గుర్తించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దల సహకారంతో 11 బ్యాంకులను తప్పుదారి పట్టించిన ట్టు ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్టు అభియోగాలు మోపింది. చక్రవర్తిరాజు అక్రమాలకు బ్యాంకుల ఉన్నతాధికారులు సహకరించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఆస్తులను పరిశీలించకుండానే కాగితాల ఆధారంగా కోట్ల రూపాయల రుణాలు ఎలా మంజూరు చేశారన్నదానిపై సీబీఐ అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది.
ప్లాట్లను ఎకరాలుగా చూపి వందల కోట్లలో అప్పులు ఇవ్వడం వెనుక ఉన్న చీకటి వ్యవహారాలను తవ్వితీసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చక్రవర్తిరాజు చేతిలో 11 బ్యాంకులు మోసపోయినప్పటికీ కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే సీబీఐకి ఫిర్యాదు చేసింది. లోను వ్యవహారంలో తమకు ఇచ్చిన సర్వే నంబర్ డాక్యుమెంట్లు, నిర్మించిన భవనాల సర్వే నంబర్లు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ భట్రా లిఖితపూర్వకంగా సీబీఐకి ఫిర్యాదుచేశారు. చక్రవర్తిరాజుపై ఎంసీడీసీ ట్రస్ట్ చైర్మన్ వీ కృష్ణారెడ్డి కూడా సీబీఐకి ఫిర్యాదుచేశారు.












Click it and Unblock the Notifications