కల్లాల నుంచి కాటికి వెళ్తున్న రైతులు.!కేంద్ర,రాష్ట్రాలకు కనిపించడం లేదా.?వరి దీక్షలో కాంగ్రెస్ ఫైర్.!
హైదరాబాద్ : ఇందిరా పార్కు వద్ద కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరి దీక్ష కార్యక్రమం ప్రారంభయ్యింది. ఈ రోజు రాత్రి అక్కడే బస చేసి ఆదివారం సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగుతున్నట్టు నేతలు స్పష్టం చేసారు. రాష్ట్రంలో ధాన్యం రైతులనుంచి ప్రతి గింజ కొని రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, వివిధ దశల్లో పోరాటాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్, ఇప్పటికే వ్యవసాయ కమిషనరేట్ ముట్టడించిందని, కల్లాలల్లో కాంగ్రెస్, వినతి పత్రాలు సమర్పణ లాంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించిందని టీపిసిసి నేతలు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిపైన రైతులతో కలిసి ఉద్యమిస్తున్న కాంగ్రెస్, ఇందిరా పార్కు వద్ద నిర్వహిస్తున్న వరి దీక్ష లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
రైతుకు భరోసా.. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల వరి దీక్ష
ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల వరి దీక్షలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలందరూ పాల్టొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, సీతక్క, మహేశ్వర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి వరి దీక్షలో పాల్గొన్నారు. నెల రోజుల నుంచి కల్లాల్లో ఉన్న వరిధాన్యం కొనాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కాగ్రెస్ నేతలు డిమాండ్ చేసారు. తడిసిన ధాన్యం కూడా కొనాల్సిందేనని, మొలకెత్తిన ధాన్యం బాధ్యత ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ హయాంలో మొలకెత్తిన, తడిసిన ధాన్యం కూడా కొన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి గుర్తు చేసారు. 2020 లో నష్ట పోయిన పంటకు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ ఇవ్వలేదని తెలంగాణ ప్రభత్వంపై కోదండరెడ్డి మండిపడ్డారు.
వరి కొనేంత వరకూ పోరాటం ఆగదు.. ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్ నేతలు..
అంతే కాకుండా ధర్నా చౌక్ లో దీక్ష ద్వారా వరి రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదని టీపిసిసి నేతలు స్పష్టం చేస్తున్నారు. టిఆర్ఎస్, బీజేపీలు అధికారం తమ చేతిలో ఉన్నా, రైతులతో రాజకీయం చేస్తోందని, వరిధాన్యం కొనకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కుంటిసాకులు చెప్తూ రాష్ట్ర రైతాంగాన్ని దిక్కుతోచని స్ధితిలోకి నెట్టేసారి మండిపడ్డారు. గతంలో ఎలాంటి సంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందని, రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుదని టీపిసిసి నేతలు వరి దీక్షా వేదిక నుండి మండిపడుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రమాలు.. కల్లాల్లో విగతజీవులుగా మారుతున్న రైతులు
తెలంగాణ బీజేపి వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కు తెలివి ఉండే మాట్లాడుతున్నడా అని టీపిసిసి నేతలు మండిపడుతున్నారు. ఏం సాదించారని బండి సంజయ్ ఊళ్ళు తిరుగుతూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాడుని ప్రశ్నించారు. రాచకొండ కొండ అడవుల్లో నిరసన ధర్నాలు చేసుకోవాలన్న చంద్రశేఖర్ రావు ధర్నా చౌక్ లో ఎందుకు నిరసన దీక్ష చేపట్టారని నిలదీసారు. వరి ధాన్యం సరైన సమయంలో కొనుగోలు చేస్తే, రైతులు చనిపోయేవారు కాదని, మోడీ ప్రభుత్వం లో గ్యాస్ పోయ్యి పోయి, పిడుకల పొయ్యిలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలకు రాష్ట్ర రైతాంగం బలవుతున్నారని టీపిసిసి నేతలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ఐకమత్యం.. వరి దీక్షలో పాల్గొన్న కోమటి రెడ్డి..
ఇదిలా ఉండగా పంట వేసే ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టలేదని, వానాకాలం పంట ఎందుకు కొనరని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తోంది. కొబ్బరి కాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప, ఒక్క గింజ కూడా కొనడం లేదని, 45 రోజులుగా రైతు కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నాడని, కొందరు రైతులు వరి కుప్పలపైనే చనిపోతున్నారని టీపిసిసి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా కేంద్ర రాష్ట్రాల వైఖరిపై పోరాటం చేయాలని, చివరి గింజ కొనేంత వరకూ ఉద్యమం నుండి నిష్క్రమించొద్దని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వరి దీక్షలో మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.