కేవైసీ కింద NPR సర్టిఫికేటా..? కస్టమర్లను గందరగోళంకు గురిచేసిన బ్యాంక్ ప్రకటన
హైదరాబాద్: ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహారం. దేశంలో చాలా కన్ఫ్యూజన్కు గురిచేస్తున్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు ప్రధాన దినపత్రికల్లో ఓ ప్రకటన ఇచ్చి ఆ బ్యాంకు కస్టమర్లను ఆందోళనకు గురిచేసింది.
బ్యాంకులో కేవైసీ సబ్మిట్ చేయని కస్టమర్లు వెంటనే అన్ని వివరాలతో కూడిన కేవైసీని సబ్మిట్ చేయాలంటూ తెలుగు దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది. వెంటనే సంబంధిత బ్రాంచ్కు వెళ్లి ఓ దరఖాస్తును పూర్తి చేసి ఒక ఫోటో, గుర్తింపు కార్డు, మైబైల్ ఫోన్ నెంబరు, సెల్ఫ్ డిక్లరేషన్ మరియు ప్రస్తుతం ఉంటున్న నివాసంకు సంబంధించిన రుజువులను సమర్పించాలంటూ పేర్కొంది. ఇలా చెబుతూ గుర్తింపు కోసం కొన్ని డాక్యుమెంట్లను ప్రకటనలో పేర్కొంది. ఇందులో పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు, ఆధార్ కార్డుతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో పేరు ఉన్నట్లు చెబుతూ సర్టిఫికేట్ సమర్పించాలని ప్రకటన ఇచ్చింది. చివరి డాక్యుమెంట్ అంటే ఎన్పీఆర్ సర్టిఫికేట్ను చదివిన బ్యాంక్ కస్టమర్లు గందరగోళానికి గురయ్యారు. వెంటనే తమ బ్యాంకుకు ఫోన్లు చేశారు కస్టమర్లు. అయితే దీని గురించి తమకు తెలియదని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఇది మరింత గందరగోళానికి గురిచేసింది.

జనవరి 31లోగా పైన చెప్పిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోతే తమ పేరుపై ఉన్న బ్యాంకు లావాదేవీలు నిలిపివేయబడుతాయని చెప్పారు. అర్షద్ హుస్సేన్ అనే సామాజిక కార్యకర్త తెలుగు దినపత్రికల్లో ఈ ప్రకటన చూసి విస్తుపోయారు. డాక్యుమెంట్లు సమర్పించేందుకు చివరి తేదీ జనవరి 31గా బ్యాంకు పేర్కొనగా అసలు ఎన్పీఆర్ సర్వే ఏప్రిల్ 1న ప్రారంభం కానుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్పీఆర్ సర్వే తర్వాత ప్రభుత్వం ఏదైనా సర్టిఫికేట్ లేదా లెటర్ కానీ జారీ చేస్తుందా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే ఈ ప్రకటన కొన్ని జిల్లా ఎడిషన్లలో మాత్రమే వచ్చిందని, పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రకటన రాలేదని చెప్పారు అర్షద్ హుస్సేన్. అయితే ఎన్పీఆర్ అమలు చేస్తున్నామని పరోక్షంగా చెప్పేందుకే ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో ఎన్పీఆర్ సర్టిఫికేట్ కూడా గుర్తింపు కింద ఒక డాక్యుమెంట్లా పనిచేస్తుందని చెప్పేందుకే ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం జరుగుతోందని మండిపడ్డారు అర్షద్.












Click it and Unblock the Notifications