KCRపై సీరియస్ అవుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు?
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర విషయంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని వారు భావిస్తున్నారు. మధ్యవర్తుల సంభాషణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రస్తావనకు రావడంతో వివాదం మరింత ముదురుతోంది.
రేపు ఫలితాలు వచ్చిన తర్వాత..
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడతాయి. ఆ తర్వాత రంగంలోకి దిగాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ నేతలు ఎన్నికల సంఘాన్ని రెండుసార్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని, విచారణ చేయించాలంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో తరుణ్ చుగ్ తోపాటు మరికొందరు కీలక నేతలున్నారు. బీజేపీ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి సమాచారం సేకరించారని తెలుస్తోంది.
కోమటిరెడ్డి కంపెనీ బ్యాంకు ఖాతాలు యాక్సెస్?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు యాక్సెస్ చేసినట్లు భావిస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు పంపించారనే విషయాన్ని లెక్క తీసినట్లు తెలుస్తోంది. అయితే సుశీ ఇన్ ఫ్రా విషయం బయటకు ఎలా వచ్చిందనే కోణంపై బీజేపీ నాయకులు దృష్టిపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ తరహాలో దీన్ని ట్రాక్ చేసివుంటారని చర్చ నడుస్తోంది. వీటన్నింటినీ బయటపెట్టి కేసీఆర్ గుట్టు బయటపెడతామని బీజేపీ నేతలంటున్నారు.
నెమ్మదించిన దర్యాప్తు?
టీఆర్ ఎస్ కూడా ఎమ్మెల్యేలకు ఎర విషయానికి సంబంధించిన దర్యాప్తు తీవ్రంగా జరపడంలేదు. ప్రస్తుతం నెమ్మదించింది. ఫోన్లను ట్యాప్ చేయలేదని చెప్పేందుకు తానే రికార్డు చేశానని ఒక వ్యక్తిద్వారా స్టేట్ మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి ఇష్యూను ట్రాప్ చేసినప్పుడు ఆ ఇష్యూలో తెలంగాణ ప్రభుత్వం ఇరుక్కోలేదు.
అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేయడంతో విషయం రోజురోజుకు సీరియస్ అవుతోందని, కేంద్రం కూడా దీన్ని వదిలిపెట్టే స్థితిలో లేదని, ఇప్పటికే అన్ని వివరాలు సేకరించి పెట్టుకున్నారని, మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందని సమాచారం.