రైతుల కోసం మోడీ సర్కారు చేసిందిదే, తెలుసుకోండి: తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. పంటలు పండించేందుకు పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తూ.. పంటలు పండించేందుకు సరైన మద్దతు ధరలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కనీస మద్దతు ధర 60-80 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. కాలానుగుణంగా పంటల బీమా పథకంలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పంటల బీమా పథకం అమలు సరిగ్గా జరగట్లేదన్నారు.

2014లో దేశ వ్యవసాయ బడ్జెట్21,933 కోట్లు ఉంటే.. తొమ్మిదేళ్లలో లక్షా 25 వేల 33 కోట్లకు పెరిగిందని.. అంటే దాదాపు 5.7 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.28,590 కోట్ల వ్యవసాయ ఋణాల మంజూరు చేయడంతోపాటు 23 కోట్ల సాయిల్హెల్త్ కార్డులను అందజేశామన్నారు. బియ్యం ఎగుమతుల్లో 109 శాతం పెరుగుదల నమోదు కాగా.. వంట నూనెల దిగుమతి బాగా తగ్గిందన్నారు. ఒకప్పుడు లక్ష కోట్ల విలువైన నూనెల దిగుమతి ఉండేదని.. ఇప్పుడు రైతుల నుంచి నూనె గింజల సేకరణలో 1500 శాతం పెరుగుదల ఏర్పడినట్లు వివరించారు కిషన్ రెడ్డి.
మోడీ ప్రభుత్వం రాక ముందు విపరీతమైన ఎరువుల కొరత ఉండేదని.. వాటికోసం రైతులు గుండెపోటుతో మరణించిన సంఘటనలున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 'భారత్ బ్రాండ్' పేరుతో యూరియా ప్రవేశపెట్టబోతున్నామన్న కేంద్రమంత్రి.. నానో యూరియా కోసం 8 ప్లాంట్లలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణకు కేంద్రం ఒకప్పుడు రూ.3,307 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.26,307 కోట్లు వెచ్చిస్తోందన్నారు. రూ.33 కిలో ఉన్న బియ్యంను ఉచితంగా 84 కోట్ల పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్నదన్నారు. పండించడానికి సబ్సిడీ, కొనుగోళ్లలో ఎంఎస్పీ, పేదలకు ఉచితంగా ఇస్తోందని వివరించారు.

పాల ఉత్పత్తి, గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు కేంద్రమంత్రి. గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, మాంసం ఉత్పత్తిలో 8వ స్థానం, పప్పుదినుసుల సేకరణలో కూడా 7300 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు.ఎరువుల విషయంలో గత ఏడాదికి ఈ ఏడాదికి ఎరువుల రాయితీ 500 శాతం పెరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 20 లక్షల కోట్లు రుణ వితరణ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి అన్ని ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తూనే.. పంటలు నష్టపోతే బీమా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుందని వివరించారు.
ఒకప్పుడు పంటనష్టం 50 శాతం జరిగితేనే పరిహారం వచ్చేది.. ఇప్పుడు 33 శాతం నష్టం జరిగినా పరిహారం వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ఈ-నామ్ మార్కెట్లు 1260 బాగా నడుస్తున్నాయి. మత్స్య పరిశ్రమకోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి కేంద్రం పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తులను ప్రోత్సహిస్తోందన్నారు. దేశ అవసరాలకు మించి ఉత్పత్తి చేసి, మిగతాది ఎగుమతి చేస్తున్నామన్నారు.

తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 6 వేలు ఇస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 6300 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించామని తెలిపారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న పంటబీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయని కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సించాయ్యోజన కింద చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులనుపూర్తి చేయడం కోసం కేంద్రం కృషి చేస్తుందన్నారు. దీని కింద తెలంగాణలో 11 ప్రాజెక్టులను గుర్తించి, వాటిని పూర్తి చేయడం కోసం ఇప్పటి వరకు 1248 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
తెలంగాణలో దాదాపు 23,948 కోట్ల రూపాయాలతో ఎల్సీడీసీ ద్వారా గొర్రెల పెంపకం, ఇతర వ్యవసాయ కార్యక్రమాలకు రుణాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆయిల్ పామ్ మిషన్కింద తెలంగాణకు రూ.214 కోట్లు మంజూరు చేశామన్నారు. పెద్ద ఎత్తున పాడిపరిశ్రమను, మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని.. ఒక్క ఎరువుల మీద 27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ తెలంగాణ రైతులకు కేంద్రం అందజేసిందన్నారు. కేంద్ర పెద్దలను అనేక సార్లు అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కును తెస్తే.. రాష్ట్ర సర్కారు నుంచి స్పందన లేదంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications