రోహిత్ మృతిపై అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల మృతిపై జ్యూడిషియల్ విచారణకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అశోక్కుమార్ రూపన్వాలా నేతృత్వంలో ఓ విచారణ కమటీని కేంద్ర మానవ వనరుల శాఖ నియమించింది.
రోహిత్ వేముల మృతికి గల కారణాలను ఈ కమిటీ విచారించనుంది. రోహిత్ మృతికి గల కారణాలపై సాక్ష్యాధారాలతో సహా సేకరించి మూడు నెలల్లోగా కేంద్రానికి ఈ కమిటీ నివేదికను ఇవ్వనుంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపిన ద్విసభ్య కమిటీ ఇప్పటికే కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదికను సమర్పించారు.
ఇది ఇలా ఉంటే రోహిత్ వేముల దళితుడు కాదనే నివేదికను కేంద్ర హోం శాఖకు పోలీసు ఉన్నతాధికారులు పంపించారు. ఈ నివేదికను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణ పరిస్ధితులు ఉన్నాయని ఇన్చార్జ్ వీసీ శ్రీవాత్సవ అన్నారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నుంచి యూనివర్సిటీ అడ్మిస్ట్రేషన్తో పాటు అన్ని విభాగాలు పనిచేస్తాయన్నారు. ఇప్పటికే విద్యార్ధి జేఏసీతో చర్చలు జరిపామన్నారు. యూనివర్సిటీ పాలకమండలికి సహకరించేందుకు జేఏసీ ఒప్పుకుందని తెలిపారు.
వేముల రోహిత్ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం తమ పరిధిలో లేదని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కుటుంబానికి రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామన్నారు. అదే విధంగా విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కేసులను ఎత్తేయాలని కోర్టును కోరామన్నారు.
వర్సిటీలో ఆందోళనలు ఇలాగే కొనసాగితే ఫెలోషిప్, స్కాలర్షిప్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలకు ఆటంకం కలిగే ప్రమాదముందన్నారు. 2008లో విద్యార్థి సెంథిల్ కుమార్ ఆత్మహత్యకు తాను బాధ్యున్ని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సీఐడీ విచారణ కూడా జరిగిందని గుర్తు చేశారు.
భవిష్యత్ ను దృష్టిలో పెట్టకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆయన కోరారు. ఆందోళనల కారణంగా స్కాలర్ షిప్ లు, ఫెలో షిప్ లు, క్లాస్ 4 ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.