హుజూరాబాద్ బైపోల్ వీవీ ప్యాట్ ఇష్యూ: విచారణకు సీఈవో ఆదేశం, ఏం జరిగిందంటే..?
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక అనంతరం వీవీప్యాట్లు తారుమారయ్యాయని, గుర్తు తెలియని వాహనంలోకి తరలించారంటూ బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ మేరకు ఆదేశించారు సీఈవో శశాంక్ గోయల్. కాగా, అన్ని రాజకీయ పార్టీల నేతలతో సోమవారం సమావేశం కానున్నారు సీఈవో. ఓటరు జాబితా సవరణ 2022 ప్రక్రియపై చర్చించనున్నారు.

ఇది ఇలావుండగా, హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి వీవీ ప్యాట్ తరలింపు విషయంపై హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) రవీందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. పనిచేయని వీవీప్యాట్ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి దానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్వో తెలిపారు.
పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించే క్రమంలో వీవీ ప్యాట్ పనిచేయలేదని దాని స్థానంలో మరో దానితో పోలింగ్ నిర్వహించామని ఆర్వో రవీందర్
రెడ్డి చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, నవంబర్ 2న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్కి బయలుదేరిన బస్లు మార్గం మధ్యలో ఒక టీఆర్ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూశామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రతతో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీసులు లేకుండా ఎలా ఈవీఎంలను తీసుకు వెళుతారు? ఎలాంటి భద్రత లేకుండా ఆ బస్లను అక్కడ ఎందుకు నిలిపి వేశారని అరుణ ప్రశ్నించారు.
Recommended Video
హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఈవీఎం బాక్స్ లను మార్చాలని చూసారన్నారు డీకే అరుణ. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అధికార పార్టీ టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు 75 కోట్ల మద్యం తాగించారని డీకే మండిపడ్డారు. ఏడేళ్ళ పాలనలో దళితులకు ఏమి చేయని ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకంను తీసుకువచ్చిందన్నారు హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఒక్క ఓటుకు ఆరువేల రూపాయలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కంటెయినర్ లో హైదరాబాద్ నుంచి హుజురాబాద్ కు డబ్బులు పంపించి హుజురాబాద్లో పంచారని ఆరోపించారు. హుజురాబాద్ పోలింగ్ ముందు మనిషికి ఆరువేలు.. ఓటు వేసే రోజు మళ్ళీ 10వేలు పంచారు. ఇన్నేళ్ళ పాలనలో కేసీఆర్ అభివృద్ధి చేసి ఉంటే పైసలు ఎందుకు పంచాడని డీకె అరుణ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications