నిజమే!: భద్రాద్రి సీతమ్మ మంగళసూత్రం, లక్ష్మణ నగ మాయం
ఖమ్మం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతమ్మవారి పుస్తెలతాడు సహా రెండు ఆభరణాలు గల్లంతవడం కలకలం రేపుతోంది. వాస్తవానికి ఆలయంలోని బంగారు నగలు మాయమయ్యాయంటూ మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.
కాగా, నిత్యకల్యాణమూర్తుల మెడలో ఆభరణాలు మాయమయ్యాయన్న ప్రచారంతో దేవాదాయ శాఖ స్పందించింది. కార్యనిర్వహణాధికారి(ఈవో) తాళ్లూరి రమేష్బాబు ఆదేశాలతో ఆదివారం ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యుల నేతృత్వంలో ఆభరణాల తనిఖీ చేపట్టారు.
ఆ తర్వాత వైదిక సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. రెండు నగలు ఉండాల్సిన చోట కనిపించలేదని తెలిపారు. ఇంత మాత్రాన ఇవి పోయినట్లు కాదని స్వామివారికి సంబంధించిన బంగారు ఆభరణాలను మొత్తం పరిశీలించాక పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు.
సోమవారం కూడా తనిఖీలు ఉంటాయని, ఆభరణాలు పోయినట్లు తేలితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనిపించని నగలు ప్రాచీనమైనవి కావని, భక్తులు కానుకల రూపంలో సమర్పించినవని తెలిపారు. కనిపించకుండా పోయిన నగల్లో సీతమ్మవారి మంగళసూత్రాలు ఒకటి కాగా మరోటి ఖరీదైన హారం(లాకెట్) ఉంది.
ఎలా కనిపించకుండా పోయాయి?
ఆగస్టు 13 నుంచి 18 వరకు ఆలయంలో పవిత్ర ఉత్సవాలు జరిగాయి. 19 నుంచి నిత్య కళ్యాణాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉత్సవమూర్తులను పరిశీలించినప్పుడు నగలు పోయిన విషయం గుర్తించారు. వాటికోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. అయితే, అప్పుడే పోయాయా? లేక అంతకుముందే పోయాయా? అనేది తేలలేదు.
ఈ క్రమంలో శనివారం విషయం బయటికి పొక్కింది. 13న నిత్య కళ్యాణం పూర్తయ్యాక మధ్యాహ్నం విగ్రహాలను ప్రధానాలయంలో ఒకవైపున ఉంచారు. అప్పటి నుంచి 19 ఉదయం వరకు అక్కడే ఉన్నాయి. కాగా, కట్టుదిట్టమైన తాళాలు, ఆభరణాలను భద్రపరిచేందుకు ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. అంతేగాక, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి.
వీటన్నిటితోపాటు భద్రతా సిబ్బంది నిఘా, పైస్థాయి పర్యవేక్షణల మధ్య ఈ నగలు మాయమవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బయటి వ్యక్తులు లోనికి వెళ్లడం సాధ్యం కాదని, లోనివారే ఎవరైనా తమ చేతివాటాన్ని ప్రదర్శించారా? లేక ఎక్కడైనా పడిపోయాయా? అనే విషయాలు తేలాల్సి ఉంది. పల్లికి ఊరేగింపులో ఏమైనా పడిపోయే అవకాశం ఉందా? అనే కోణంలోనూ అధికారులు విచారించనున్నారు. పోయిన నగల విలువ సుమారు రూ. 3లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.