గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండకు ఛాన్స్? రాజకీయంగా పట్టు కోల్పోతున్న తొలి స్పీకర్ కు కేసీఆర్ ఊపిరి పోస్తారా
తెలంగాణ రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్ గా పని చేసిన సిరికొండ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యతను ఇవ్వనున్నారా? ఆయనకు మళ్ళీ పార్టీలో కీలకంగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారా? గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా? అంటే అవకాశం ఉందని చెప్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు.

స్పీకర్ గా వెలుగు వెలిగిన మధుసూదనాచారి.. ఇప్పుడు రాజకీయంగా పట్టు కోల్పోతున్న స్థితి
సిరికొండ మధుసూదనాచారి టీఆర్ఎస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. భూపాలపల్లి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఆయన తనదైన శైలిలో పని చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడుగా గుర్తింపు ఉంది. అలాంటి మధుసూదనాచారి 2018 ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయంగా ఆయన ప్రాధాన్యత క్రమంగా తగ్గింది.

భూపాలపల్లిలో ఓటమి, గండ్ర రమణారెడ్డి చేరికతో పార్టీలో డల్ అయిన మాజీ స్పీకర్
భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా గులాబీ పార్టీలో చేరడంతో స్థానికంగా సిరికొండ మధుసూదనాచారి ప్రాధాన్యత మరింత తగ్గింది. టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హవా నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతుంది. సిరికొండ మధుసూదనాచారి ఎక్కడా బయట పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించని పరిస్థితి ఉంది. తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ గా పనిచేసిన ఆయన పార్టీలో క్రమంగా ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన పార్టీలో తన స్థానం ఏంటో అర్థం కాక అగమ్యగోచరం స్థితిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వటంపై పార్టీలో చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. ఆయనకు శాసన మండలి చైర్మన్ గా అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం సైతం పార్టీలో వ్యక్తం అవుతుంది. సిరికొండ మధుసూదనా చారికి ఎమ్మెల్యే కోటలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం కానీ, పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గవర్నర్ తిరస్కరించటంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. సిరికొండ మధుసూదనా చారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చెయ్యటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్న క్రమంలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

గవర్నర్ కోటాలో సిరికొండ మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ?
ఇదిలా ఉంటే గవర్నర్ కోటాలో మాజీ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించిన కేసీఆర్ దీనికి సంబంధించిన ఫైలును గవర్నర్ కు పంపనున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిరికొండ మధుసూదనాచారి గులాబీ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కీలక భూమిక పోషించిన వ్యక్తి. మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే పార్టీలో ఆయన పుంజుకునే అవకాశం ఉంటుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న ఆయనకు కాస్త శక్తినిచ్చినట్టు అవుతుంది.
Recommended Video

ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే సిరికొండకు కాస్త ఊరట
సిరికొండ మధుసూదనా చారి తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ గా పనిచేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఆయన తనదైన మార్కు వేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలను ఎంతో ఔచిత్యంతో నిర్వహించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారి ఓడిపోవడంతో టిఆర్ఎస్ పార్టీలో ఆయన ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. ప్రస్తుతం మళ్లీ ఆయనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే కాస్త ఊరట లభించినట్లే అవుతుందని మధుసూధనాచారి అనుచరులు భావిస్తున్నారు. మొత్తానికి గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల నుండి పక్కకు తప్పుకున్నట్లుగా భావిస్తున్న సిరికొండ మధుసూదనాచారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే మళ్లీ ఆయనకు రాజకీయంగా ఊపిరి పోసినట్లే అవుతుంది.












Click it and Unblock the Notifications