మోడీకి ఈటెల కితాబు: దగ్గరవుతున్న బీజేపీ-టీఆర్ఎస్, కవితకు 'కీలక' బాధ్యత!
నోట్ల రద్దు అంశాన్ని కేసీఆర్, తెరాస స్వాగతించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ - తెరాసలు క్రమంగా ఒక్కటవుతున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: నోట్ల రద్దు రద్దు అనంతరం కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ భవిష్యత్తులో ఆ ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్న ధీమాతో అన్ని వర్గాల ప్రజలు దానిని స్వాగతిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
సచివాలయంలో నోట్ల రద్దు - వినియోగదారుల సమస్యలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని, ప్రసంగించారు. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలన, నకిలీ నోట్ల ప్రవాహం, ఉగ్రవాదుల చేతుల్లోకి డబ్బు చేరకుండా అడ్డుకట్టవేసేందుకు, జాతి అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు.
కేసీఆర్ టు నితీష్, పవన్ టు బాబు: నోట్ల రద్దు - రసవత్తర రాజకీయం
సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయిందని చెప్పేందుకు టిటిడి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఉదంతమే నిదర్శనం అన్నారు. అందుకే సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు డెబ్బై ఏళ్ల తర్వాత మోడీ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రమైందన్నారు.
బీజేపీ - తెరాస ఒక్కటవుతున్నాయా?
నోట్ల రద్దు అంశాన్ని కేసీఆర్, తెరాస స్వాగతించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ - తెరాసలు క్రమంగా ఒక్కటవుతున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం నోట్ల రద్దు అంశమే కాకుండా పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు.
శాసన సభలో అధికార తెరాస పైన బీజేపీ ఎమ్మెల్యేలు ఒంటికాలి పైన లేచేవారని, ఇప్పుడు మాత్రం సలహాలు, సూచనలకే పరిమితం అవుతున్నారని చెబుతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు కేంద్రంలో తెరాస చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అదే జరిగితే పార్టీ సీనియర్ నేతలు కే కేశవ రావు, జితేందర్ రెడ్డిలకు కేంద్రమంత్రి పదవులు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎంపీ కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చునని అంటున్నారు. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ నుంచి పార్టీ మంత్రుల వరకు అందరూ స్వాగతిస్తున్నారు.