చందానగర్ హత్య కేసు: పోలీసులకు లొంగిపోయిన అపర్ణ భర్త, మరి ప్రియుడెక్కడో?
హైదరాబాద్: చందానగర్ వేమకుంటలోని అపార్ట్మెంట్లో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దారుణ హత్యకు గురైన కేసులో నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్న అపర్ణ భర్త మధు సోమవారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు.
షాకింగ్: నాలుగేళ్ల చిన్నారి సహా ఇద్దరు మహిళలు హత్య! చేసింది భర్తా? ప్రియుడా?
కేపీహెచ్బీ పోలీసుల వద్దకు వెళ్లిన మధు.. తనను మృతురాలు అపర్ణ భర్తగా పరిచయం చేసుకుని లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కేపీహెచ్బీ పోలీసులు మధును చందానగర్ పోలీసులకు అప్పగించారు.
చందానగర్ వేమకుంటలోని అపార్ట్మెంట్లో నివసిస్తూ ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలో సేల్స్ ఉమన్గా పనిచేస్తోన్న అపర్ణ, ఆమె తల్లి విజయలక్ష్మి, అపర్ణ కుమార్తె, నాలుగేళ్ల చిన్నారి కార్తికేయిని దారుణ హత్యకు గురైన సోమవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
స్థానికులు అందజేసిన వివరాల ప్రకారం ఈ హత్య కేసులో అపర్ణ భర్త, కూకట్ పల్లికే చెందిన మధును, అలాగే ఆమె ప్రియుడు, మొబైల్ షాప్ నిర్వాహకుడు అయిన రూప్లాల్ ను నిందితులుగా అనుమానించారు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా అపర్ణ భర్త మధు పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం సాయంత్రం కేపీహెచ్బీ పోలీసుల వద్దకు వెళ్లిన మధు.. తనను తాను పరిచయం చేసుకోవడంతో పోలీసులు అతడ్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ హత్యోదంతం మొత్తానికి మధుయే కారణమా? లేక ఇంకెవరి హస్తమైనా ఉందా? మొబైల్ షాప్ నిర్వాహకుడు అయిన రూప్లాల్ ఎక్కడున్నాడు? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అపర్ణ భర్త మధును చందానగర్ పోలీసులు విచారిస్తున్నారు.