చంద్రబాబు అమరావతికి .. రేవంత్ ఢిల్లీకి .. ఇద్దరూ పత్తా లేరు: మంత్రి కేటీఆర్
టీటీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఆయనకు తెరచి ఉన్న ఒకే ఒక దర్వాజా కాంగ్రెస్ పార్టీ, గత్యంతరం లేక దాంట్లోకి పోయాడు..’ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: టీటీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు కొంతమంది బుధవారం టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 'రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకుపోయాడు? ఆయనకు అన్ని దర్వాజాలు బందయ్యాయి. టీఆర్ఎస్ లోకి ఎంట్రీ లేదు. తెలుగుదేశం ఖతమైపోయింది. తెరచి ఉన్న ఒకే ఒక దర్వాజా కాంగ్రెస్ పార్టీ, గత్యంతరం లేక దాంట్లోకి పోయాడు..' అని వ్యాఖ్యానించారు.
Recommended Video
అంతేకాదు, 'కాంగ్రెస్ లోకి పోయిన రేవంత్, ఇవాళ పెద్ద పెద్ద మాటలు, డైలాగ్స్ చెబుతూ బిల్డప్ ఇస్తున్నాడు. మాకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, వాళ్ల నాటకాలు కొత్త కాదు. 'తెలంగాణలో టీడీపీని నేనే అధికారంలోకి తీసుకొస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా.. అని కొడంగల్ లో రేవంత్ నాడు చెప్పుకున్నాడు. మరీ, ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి..' అని ప్రశ్నించారు.
'చంద్రబాబునాయుడు, లోకేశ్ నాయుడు, రేవంత్ రెడ్డి ఇదే నరుకుడు నరికారు. ఇప్పుడేమైంది? చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లిపోయాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఇద్దరూ పత్తా లేరు! తెలుగుదేశం పార్టీని చాపలాగా మడతపెట్టి ఎక్కడో పెట్టేశారు. అటువంటి వాళ్లు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు..' అని కేటీఆర్ దుయ్యబట్టారు.
అంతేకాదు, 'సోనియా గాంధీని దెయ్యమని, రాహుల్ ని పప్పు అని విమర్శించిన రేవంత్ కు, వాళ్లు ఈరోజున దేవతల్లాగా కనపడుతున్నారు.. ఏం చేస్తాం కర్మ! అన్ని సందర్భాల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన నాయకుడి నాయకత్వాన్ని కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని నేను మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..' అని మంత్రి కేటీఆర్ చెప్పారు.