కెసిఆర్ యాగానికి చంద్రబాబు: తెలంగాణ టిడిపి నేతల్లో గుబులు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తలపెట్టిన ఆయుత చండీయాగం తమ కొంప మీదికి తెచ్చిపెట్టిందనే భావనతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఈ యాగానికి చంద్రబాబును కెసిఆర్ ఆహ్వానించడం, యాగానికి వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధ్యక్షుడు వెళ్లడానికి సిద్ధపడడం తెలంగాణ టిడిపి నాయకులకు మింగుడు పడడం లేదు.
ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ చంద్రబాబు యాగానికి హాజరైతే మరింతగా నష్టపోతుందనే గుబులు టిడిపి నాయకుల్లో చోటు చేసుకుంది. చండీయాగానికి ఆహ్వానం అందించడానికి విజయవాడ వెళ్లిన కెసిఆర్కు చంద్రబాబు సకల మర్యాదలు చేశారు. వారిరువురు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను చూసిన టిడిపి కార్యకర్తలు నిరాశకు లోనయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన తర్వాత చంద్రబాబు, కెసిఆర్ మూడు సార్లు కలుసుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా కెసిఆర్ వద్దకు వచ్చారు. అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ హాజరు కావడంతోనే పరిస్థితి తారుమారైందని అంటున్నారు. ఆ తర్వాత ఆయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు కెసిఆర్ విజయవాడలో చంద్రబాబు వద్దకు వెళ్లారు.
నిజానికి, కాంగ్రెసును తలదన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు తామే ప్రధాన ప్రత్యర్థులుగా తయారు కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు కెసీఆర్తో సాన్నిహిత్యం పెంచుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చిందని అంటున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ను తాము బలంగా ఎదుర్కునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలంగాణ టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెసిఆర్ తాజాగా అమరావతి వెళ్లినప్పుడు టిటిడిపి నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. కెసిఆర్, చంద్రబాబు భేటీ జరుగుతున్న నేపత్యంలో తాము మీడియా సమావేశం పెట్టి కెసిఆర్కు వ్యతిరేకంగా మాట్లాడడం సరి కాదనే ఉద్దేశంతో వారు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
మొత్తం మీద, కెసిఆర్తో చంద్రబాబు సాన్నిహిత్యం వల్ల తెలంగాణలో టిడిపికి తీవ్రమైన నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అని చంద్రబాబు చెబుతున్నప్పటికీ పార్టీని బలోపేతం చేయడానికి అది ఆటంకంగా మారుతుందనే అభిప్రాయం మాత్రం ఉంది.