బాబు ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఇక రేవంత్ అంతే: రమణ, ‘వేటు తొందరపాటే’
హైదరాబాద్: తెలుగుశం పార్టీలో ఇప్పుడు రెండు వర్గాలు చీలిపోయినట్లు తెలుస్తోంది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెళతారన్న వార్తలు వచ్చిన నాటి నుంచి ఎల్ రమణ ఎక్కడా తగ్గడం లేదు. ఇందుకు తోడు ఎల్ రమణకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తగ్గిన రేవంత్: టీడీపీఎల్పీ భేటీ రద్దు అందుకే, ఐనా వేటుకు ముమ్మరయత్నాలు
చంద్రబాబు ఆమోదంతోనే..
కాగా, , రేవంత్ రెడ్డి వెంట వెళ్లేందుకు టీడీపీ నేతలెవ్వరూ కూడా అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎల్ రమణ.. రేవంత్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. అంతేగాక, వర్కింగ్ ప్రెసిడెంట్గా, టీడీఎల్పీ నేతగా రేవంత్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని పార్టీ అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశానని, ఇందుకు ఆయన ఆమోదం తెలిపారని రమణ ప్రకటించారు.
పుల్ పవర్స్ నాకే..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ తనకు పూర్తి అధికారాలు ఇచ్చారని ఎల్ రమణ తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్నా తననే తీసుకోమని ఆదేశించారని చెప్పారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు తమ పార్టీ ఎన్నడూ అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేశారు.
రేవంత్ అంతే.. ఇక ఆయనిష్టం..
రేవంత్.. ఓ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన్ను పరిగణిస్తున్నామని రమణ తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా, టీడీఎల్పీ నేతగా కొనసాగే అర్హతను రేవంత్ కోల్పోయారని స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు టీడీపీ, బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, దీనికి రావాలని రేవంత్కు సమాచారాన్ని పంపామని, వచ్చేది, రానిదీ ఆయన ఇష్టమని తెలిపారు. తమ అధినేత వచ్చిన తరువాత అన్ని విషయాలను ఆయనతో చర్చించి రేవంత్ పై తుది నిర్ణయం తీసుకుంటామని రమణ పేర్కొన్నారు.
రేవంత్పై వేటు తొందరపాటే
రేవంత్ ఏకంగా రెండు పదవులకు అర్హత కోల్పోయినట్లు, చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు రమణ చేసిన వ్యాఖ్యలపై కొందరు టీటీడీపీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేశారు. ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని కనీస సమాచారం కూడా లేకుండా తీసుకోవడమేంటని ప్రశ్నించారు. అంతేగాక, పార్టీ సఖ్యత కోసం సీనియర్లు అటు రేవంత్తో, ఇటు రమణతో ఫోన్లో మాట్లాడారు. బాబు వచ్చిన తర్వాతే చర్చిద్దామని, అప్పటిదాకా సంయమనం పాటిద్దామని ఇద్దరు నేతలకూ హితవు పలికినట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశానికి అవసరమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, నేటీ ఈ బీజేపీ-టీడీపీ భేటీకి రేవంత్ హాజరవుతారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.