కేసీఆర్లా ఉండాల్సింది, మీ సత్తా తెలిసేది: బాబుతో నేతలు, రాహుల్ ఆఫర్తో బీజేపీపై దాడి!
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులా మీరు ఉంటే బాగుండునని తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ సీఎం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో అన్నారు. మంగళవారం టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక్క రాష్టానికే పరిమితమైనందున కేంద్రం తక్కువగా అంచనా వేస్తోందని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడగడితే మీ సత్తా తెలిసేదన్నారు.

మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే
మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళితే వాళ్లకు ఇబ్బంది ఎదురు అవుతుందని వాళ్లు భావిస్తున్నారేమోనని కొందరు టీడీపీ నేతలు అన్నారు. థర్డ్ ఫ్రంట్ అంశాన్ని మీరు లేవనెత్తాకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావించారని కొందరు గుర్తు చేశారు.

నాకు అలాంటి ఆసక్తి లేదు
దానిపై చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. అలాంటివన్నీ తాను ఇది వరకే చూశానని చెప్పారు. . జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ఢిల్లీకీ, ఇక్కడికీ తిరగాల్సి ఉంటుందన్నారు.

ఏపీపై దృష్టి సారించాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలన్నదే తన ఏకైక లక్ష్యంగా చంద్రబాబు తెలిపారు. విభజన నేపథ్యంలో నష్టపోయిన ఏపీపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.

రాహుల్ గాంధీ ఆఫర్
నాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే, నేడు బీజేపీ సహకరించడం లేదని ప్రజలు నిందించే పరిస్థితి ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే రాహుల్గాంధీ హాజరై అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, ఇంకా అనేక పార్టీలు మద్దతు ఇస్తున్నాయని, ఇవన్నీ చూస్తుంటే మనది రాజకీయ పోరాటం కాదు ప్రజల మనోభావాలకు సంబంధించినది అని అందరికీ అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ హోదాకు మద్దతిస్తున్నారని చంద్రబాబు పలుమార్లు గుర్తు చేస్తున్నారు. బుధవారం అసెంబ్లీలోను రాహుల్ గాంధీ ఇచ్చిన ఆఫర్ గుర్తు చేస్తూ బీజేపీని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications