అదంతా డ్రామా: తెలంగాణ శాసన సభలో సస్పెన్షన్పై చంద్రబాబు
న్యూఢిల్లీ: తెలంగాణ శాసన సభలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను, విపక్షాలను సస్పెండ్ చేయడం పైన టిడిపి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో స్పందించారు.
తెలంగాణ అసెంబ్లీలో టిడిపి సభ్యుల్ని సస్పెండ్ చేయడమంతా డ్రామాలో ఓ భాగమని వ్యాఖ్యానించారు. తెలంగాణ టిడిపి ప్రజల పక్షాన పోరాడుతోందని చెప్పారు.
కాగా, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని విపక్షాలు (కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వామపక్షాలు) శాసన సభలో డిమాండ్ చేయగా, సోమవారం నాడు విపక్ష ఎమ్మెల్యేలను శాసన సభ నుంచి ఈ సెషన్ మొత్తం బహిష్కరించారు.

రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారని, అందుకే వారికి ఒకేదఫా రుణమాఫీ చేయాలని, తద్వారా వారికి ఊరట కలుగుతుందని విపక్షాలు చెబుతున్నాయి. ధనిక రాష్ట్రమని, ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పే ప్రభుత్వం... రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అంగన్వాడీల సమస్యలపై సభలో చర్చ జరుగుతోంది.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమాధానం ఇస్తూ... కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి 90 శాతం నిధులు విడుదల చేసిందని, అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపుతో ప్రభుత్వంపై రూ.205 కోట్ల భారం పడుతుందని చెప్పారు.
అంగన్వాడి భవనాల నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తున్నారని కాని భవన నిర్మాణం కోసం ఆరు లక్షలు ఖర్చు అవుతుందని, మంత్రి నిధులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అడిగిన ప్రశ్నికు మంత్రి సానుకూలంగా స్పందించారు.
నిధులు పెంచడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న అసంపూర్తిగా ఉన్న భవనాలను , అవసరం ఉన్న చోటు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్య లక్ష్మీ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications