బాబుపై తలసాని ఘాటు వ్యాఖ్య, టేపు కావాలి: ఏసీబీ, బాబుకు తప్పదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు ఏసీబీ నోటీసులు తీసుకోకుంటే మెడ పట్టి జైలుకు తరలిస్తారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏసీబీ తీరుతెన్నుల పైన అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. ఏసీబీ గురించి చంద్రబాబు చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడిని రాజేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆడియో, వీడియో టేపులను ఏసీబీ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించింది. ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. వీటి కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.
కోర్టులో ఏసీబీ మెమో దాఖలు
ఏసీబీ గురువారం నాడు కోర్టులో మెమో దాఖలు చేసింది. ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన హార్డ్ డిస్క్, టేప్లు ఇవ్వాలని కోరింది. కేసు విచారణకు వాటి అవసరం ఉందని పేర్కొంది. తదుపరి విచారణకు దీని ద్వారానే ముందుకు వెళ్లవలసి ఉందని చెప్పింది.
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య వెనుక ఏపీ సర్కారు, టీడీపీలు ఉన్నాయని న్యాయవాది మోహన్ రావు ఆరోపించారు. బుధవారం ఆయన హైకోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
మత్తయ్య అరెస్టుపై కోర్టు స్టే ఇవ్వడంపై అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కేసును సరిగా వినకుండానే, బయాస్ లేకుండానే స్టే మంజూరు చేస్తూ తీర్పు చెప్పారన్నారు. తెలంగాణలో మత్తయ్యపై నమోదైన కేసుపై ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా వాదిస్తారని, మత్తయ్య కేసు విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.