బాబు ఇంటికి ఎసిబి: వివరాలకు రహస్యంగానా? లోకేష్ డ్రైవర్కు ఎసిబి నోటీసు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి తెలంగాణ ఎసిబి కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి వచ్చిన విషయం తెలిసిందే. నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి కోసం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
అదే సమయంలో, ఆ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది నుంచి రహస్యంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. హైసెక్యూరిటీ ఉండే ప్రాంతంలోకి ఎసిబి కానిస్టేబుళ్లు రావడంపై ముఖ్యమంత్రి సిఎస్ఓ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి సిఎస్ఓ ఎసిబి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో, ఎసిబి ఉన్నతాధికారి క్షమాపణ చెప్పినట్లుగా కూడా చెప్పారట!

కాగా, ఓటుకు నోటుకేసులో లోకేష్ కాన్వాయ్లోని కారు డ్రైవర్ కొండల్ రెడ్డిని ప్రశ్నించాలని ఎసిబి అదికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు సిఆర్పీసీ 160 సెక్షన్ కింద్ కొండల్ రెడ్డికి నోటీసు సిద్ధం చేశారు.
కొండల్ రెడ్డికి నోటీసు ఇచ్చేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎసిబి సిబ్బంది వెనుదిరిగారు. ఆయనకు ఇవాళ, రేపట్లో నోటీసులు ఇవ్వవచ్చ. అదే సమయంలో కానిస్టేబుళ్లు హడావుడి చేశారని వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఎసిబి న్యాయస్థానం ఓటుకు నోటు కేసులోని ఛార్జీషీటును ప్రస్తుతానికి పెండింగులో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఎసిబి అధికారులు ఆదనపు ఛార్జీషీటు దాఖలు చేయవలసి ఉంది. అప్పటి వరకు ఛార్జీషీట్ పెండింగులో పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.
కొండల్ రెడ్డికి నోటీసులు
నారా లోకేష్ కాన్వాయ్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. రేపు (గురువారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications