కరెంటు బిల్లులకు చెక్.!జిహెచ్ఎంసి కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్.!
హైదరాబాద్ : ప్రభుత్వానికి ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు నగర పాలక సంస్ధ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల అధిక విద్యత్తు బిల్లులకు చెక్ సెట్టేందుకు జిహెచ్ఎంసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని నగర పాలక సంస్ధల కార్యాలయాలకు సోలార్ సిస్టమ్ తో విద్యుత్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది నగర పాలక సంస్థ.
అందుకు సంబంధించిన మార్గదర్శాకాలను నగర పాలక సంస్థ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో క్షేత్ర స్థాయిలో ఉన్న ఆయా కార్యాలయాల్లో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడంతో పాటుగా విద్యుత్ బిల్లులు చెల్లింపు భారం కాకుండా పలు కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను అమర్చడం జరుగుతోందని జీహెచ్ఎంసీ అధికారులు దృవీకరిస్తున్నారు.
నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయ భవనలకు సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు 941కిలో వాట్స్ సోలార్ పి.వి గ్రిడ్ రూఫ్ టాప్ సిస్టమ్ నెట్ మీటరింగ్ పద్ధతిలో సప్లై చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణ ఇందన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ కు 3.50 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఒప్పందం కుదిరింది. సోలార్ సిస్టం ఏర్పాటుకు డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్ తో పాటుగా ఐదేళ్ల వరకు పూర్తి నిర్వహణ భాద్యత వారిదే ఉంటుందని అదికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం 1500 కిలో వాట్స్ మినిమం జనరేషన్ చేయాలంటే 14,11,500 యూనిట్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కున మొత్తంలో జనరేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ జనరేట్ అయిన దానిని ఆదా చేస్తే జిహెచ్ఎంసికి మినిమం రెండున్నర ఏళ్లలోపు గాని అంతకంటే ముందు గాని 1.27 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకు 34 కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అదికారులు వివరిస్తున్నారు.