కొండెక్కిన కోడి.. ఆల్ టైమ్ రికార్డు.. కేజీ చికెన్ ధర ఎంతో తెలుసా..
నెల క్రితం వరకు చికెన్ కొనేవాళ్లే లేక పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోయింది. కొన్నిచోట్ల కోళ్లను సజీవంగా పాతిపెట్టగా.. మరికొన్నిచోట్ల ఉచితంగా పంపిణీ చేశారు. కిలో రూ.30కి పడిపోయినా కొనేవాళ్లు లేకపోవడంతో చికెన్ వ్యాపారులు లబోదిబోమన్నారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కోడి ధర కొండెక్కింది. మునుపెన్నడూ లేనంతగా ఆల్ టైమ్ గరిష్ట ధరకు చేరుకుంది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.310 పలుకుతోంది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలోనే ఇది అత్యధిక రేటు కావడం గమనార్హం.
Recommended Video
దేశ వ్యాప్తంగా చికెన్ ఎంతగా తింటున్నారో తెలుసా .. షాకింగ్ రిపోర్ట్
ధర ఎందుకు పెరిగింది..
గతంలో చికెన్ తింటే కరోనా సోకుతుందేమోనన్న అపోహలతో చాలామంది చికెన్ను దూరం పెట్టారు. దీంతో పౌల్ట్రీ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. డిమాండ్ లేక చాలాచోట్ల కోళ్లను ఉచితంగానే పంపిణీ చేశారు. ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని కూడా 60శాతానికి పైగా తగ్గించేశారు. అయితే ఆ తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసమని జనం క్రమంగా చికెన్ తినడం మొదలుపెట్టడంతో డిమాండ్ పుంజుకుంది. మరోవైపు డిమాండ్కు సరిపడా కోళ్లు లేకపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి.
డిమాండ్కు సరిపడా సప్లై లేక..
మూడో విడత లాక్ డౌన్లో చాలా సడలింపులిచ్చినప్పటికీ హోటల్స్,రెస్టారెంట్స్,బార్స్,రోడ్డు పక్క దుకాణాలను మాత్రం అనుమతించని సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ షాపులు కూడా ఇప్పుడు తెరిచి ఉంటే చికెన్ ధర మరింత పెరిగి ఉండేదని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ఆయా జిల్లాల్లో రోజుకు లక్ష కోళ్లు అమ్ముడయ్యేవని.. వారంతాల్లో రెండు లక్షల కోళ్లు అమ్ముడయ్యేవని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఫారాల్లో రోజుకు 40వేల కోళ్లకు మించి లభ్యత ఉండట్లేదని.. దీంతో చికెన్ ధర పెరుగుతోందని అన్నారు.
మరింత పెరిగే ఛాన్స్
ఫారాల్లో కోళ్ల లభ్యత తగ్గిన నేపథ్యంలో రాబోయే కొద్దిరోజుల వరకు క్రమంగా చికెన్ ధరలు పైకి ఎగబాకే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అంతరాష్ట్ర రవాణాకు కేంద్రం అనుమతిస్తే.. పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు దిగుమతి చేసుకోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని రిటైల్ షాపుల్లో కేజీ చికెన్ ధర రూ.270గా ఉంది. పలుచోట్ల కాస్త అటు ఇటుగా రూ.300 వరకు అమ్ముతున్నారు. ధరల పెరుగదల పట్ల సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.