పింక్ సిటీగా హైదరాబాద్: ‘గులాబీ’ హోర్డింగులపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు
హైదరాబాద్: మన దేశంలో పింక్ సిటీ ఏదని అడిగితే ఠక్కున చెప్పే సమాధానం జైపూర్. అయితే గ్రేటర్లో ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పింక్ సిటిగా మారిందంటూ జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి.
ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జరగనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ గులాబీ జెండాలు, హోర్డింగులే కనిపిస్తున్నాయి. జంట నగరాల్లోని ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి.
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగానే సుమారు 9,000 వరకు హోర్డింగులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన కూడళ్లలో కళ్లు తిప్పుకోలేని విధంగా వివిధ వాణిజ్య ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.
గతంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో వాణిజ్య ప్రకటనలు కనిపించేవి. కానీ, ఎన్నికల నేపథ్యంలో వాటి స్థానంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కటౌట్లు, హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 'గులాబీ' రంగుతో కూడిన హోర్డింగులను నగరమంతటా ఉంచారు.
హోర్డింగులతో పాటు నగరంలోని ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు ఒక్కటేమిటీ అన్ని చోట్లా కూడా గులాబీమయం అయిపోయింది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యమే హైదరాబాద్ గులాబీ మయానికి కారణమని జాతీయ మీడియాలో కథనాలు చెబుతున్నాయి.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్, గ్రేటర్లో మాత్రం ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం నగర ప్రజలకు ఇప్పటికే పెద్ద ఎత్తున తాయిలాలను ప్రకటిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, నగరంలో వెలసిన హోర్డింగ్లలో సైతం ప్రచారానికి వాడుకుంటోంది.
ముఖ్యంగా కార్ హమారా.... సర్కార్ హమారా.... షహర్ హమారా.... మేయర్ హమారా... అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నినాదం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లిందని జాతీయ మీడియాలోని కథనాల్లో పేర్కొన్నాయి. గ్రేటర్ పీఠాన్ని తమకు అప్పగిస్తే జరిగే అభివృద్ధి, ఇతర పార్టీలకు ఓటేస్తే జరిగే నష్టానికి సంబంధించిన అంశాలను కూడా హోర్డింగ్లలో ప్రస్తావించాయి.
నగరంలో టీఆర్ఎస్కు ఎంతమేర పట్టుంది? పట్టు నిలుపుకునేందుకు ఆయా పార్టీలు పన్నుతున్న వ్యూహాలు, పార్టీల మధ్య పొత్తులు, భవిష్యత్తు రాజకీయాలను ప్రస్తావిస్తూ సాగిన ఆ కథనాలు దేశవ్యాప్తంగా పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాగా గ్రేటర్లో ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే.