బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనపై స్పందించిన చిరంజీవి
హైదరాబాద్: ఇటీవల బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదివే చిన్నారి(4)పై జరిగిన అఘాయిత్యం ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేస్తూ స్పందించారు.
'నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను' అని వ్యాఖ్యానించారు చిరంజీవి.
అంతేగాక, భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నానని అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, నాలుగేళ్ల చిన్నారిపై పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు ప్రిన్సిపాల్ ఎస్ మాధవి, డ్రైవర్ రజనీ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ పాఠశాలలోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తరగతులను ఈ పాఠశాలలోనే ఈ సంవత్సరం కొనసాగించాలని కోరుతున్నారు. నేరం చేసిన వారికి శిక్షపడాలని, వారు నేరం చేస్తే తమకు ఈ విధమైన శిక్షలు తగదని అంటున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.