టిఆర్ఎస్లోకి డీకే అరుణ సోదరుడు: కెసిఆర్ను కలిసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కలిశారు.
త్వరలోనే టిఆర్ఎస్ పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడే ఈ చిట్టెం రామ్మోహన్ రెడ్డి.
కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న రామ్మోహన్రెడ్డితో మంత్రి లక్ష్మారెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే పలువురు టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రజలకు మెరుగైన పాలన: కేటీఆర్
ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని మంత్రి కెటి రామారావు అన్నారు. ప్రగతి రిసార్ట్స్లో కార్పోరేటర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్న విషయం తెలిసిందే. శిక్షణ తరగతులకు వరంగల్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ కార్పోరేటర్లు హాజరయ్యారు. చివరి రోజైన బుధవారం తరగతులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎన్నికైన కొత్తలో ప్రజాప్రతినిధులకు అన్ని విషయాలపై స్పష్టత ఉండదన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి కార్పోరేషన్కు రూ.100 కోట్లు కేటాయించామని చెప్పారు. వరంగల్ కార్పోరేషన్కు ప్రత్యేకంగా రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కార్పోరేటర్లు వారధిగా ఉండాలని, అందరం కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని చెప్పారు.
డీకే అరుణ చేరరు: చిట్టెం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకర్షించాయని, బంగారు తెలంగాణ సాధన దిశగా తనవంతు కృషి చేయాలనే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని చిట్టెం రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఆయన.. తనను ఎవరూ ఆహ్వానించలేదని, తనంతట తానుగానే వచ్చానని తెలిపారు.
తన సోదరి డీకే అరుణ టిఆర్ఎస్ పార్టీలోకి రారని తెలిపారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాము ఏ పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదని, కేసీఆర్ వెంట నడవాలన్న కోరికతోనే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తున్నారని అన్నారు. విపక్షాలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.