నల్గొండ నుంచి ఫోన్ వచ్చింది కానీ.: పంజాగుట్ట పీఎస్లో యువతి ఫిర్యాదుపై కృష్ణుడు
హైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె పేర్కొన్న 139 మందిలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఉద్దేశపూర్వకంగానే తమపై కుట్ర జరుగుతోందని, నిజానిజాలు పోలీసుల విచారణలో త్వరలోనే వెల్లడవుతాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు అంటున్నారు.
ఈ కేసుతో సంబంధం లేదు.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
తాజాగా, సినీనటుడు కృష్ణుడు స్పందించారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదో తప్పుడు కేసుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. షీటీమ్స్, పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉన్న సమయంలో చదువుకున్న యువతి తనకు అన్యాయం జరుగుతుంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
విచారణకు సహకరిస్తా.. నిజాలు తేలుస్తారు..
నిజంగా ఆమెకు అన్యాయం జరిగివుంటే డయల్ 100కు ఫోన్ చేసుంటే పోలీసులు తక్షణమే స్పందించివుండేవాళ్లు అని అన్నారు. తమను కలవడానికి చాలా మంది వస్తుంటారు.. సెలబ్రిటీలను కేసులో ఇన్వాల్ చేయడంతో కేసు తీవ్రత పెరుగుతుందంటే తప్పు అని ఆయన అన్నారు. ఈ కేసులో నిజానిజాలను పోలీసులు వెలికితీస్తారని కృష్ణుడు తెలిపారు. ఈ కేసులో పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు కానీ, ఫోన్ కానీ తనకు రాలేదని, ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
Recommended Video
నల్గొండ నుంచి ఓ మహిళ ఫోన్ చేసి..
ఇలాంటి ఆరోపణలతో తాము, తమ కుటుంబసభ్యులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నారన్నారు. ‘నాలుగైదు నెలల క్రితం నల్గొండ జిల్లా నుంచి ఓ మహిళ నాకు ఫోన్ చేసింది. నేను, మీ అభిమానిని నల్గొండకు రావాలని ఫోన్లో చెప్పింది. అయితే, నాకు అనుమానం వచ్చి కాల్ కట్ చేసి.. ఆ నెంబర్ను బ్లాక్ చేశాను' అని కృష్ణుడు తెలిపారు. కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రముఖ యాంకర్ ప్రదీప్ కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తమపై ఏదో కుట్ర జరుగుతోందని అన్నారు. తమను, తమ కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.