Huzurabad : ఈటల వర్గం వర్సెస్ టీఆర్ఎస్... కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో తీవ్ర వాగ్వాదం
హుజురాబాద్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్,టీఆర్ఎస్ వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈటల మద్దతుదారులు అక్కడికి వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్,జడ్పీ ఛైర్ పర్సన్ విజయ,స్థానిక ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి జడ్పీ ఛైర్ పర్సన్ ఎలా అధ్యక్షత వహిస్తారని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల గొడవతో లబ్దిదారులు నివ్వెరపోయారు. రాజకీయాలు పక్కనపెట్టి తమకు చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. చివరకు ఆర్డీవో చొరవతో 189 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం(జూన్ 16) ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ,మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్,మాజీ డీఎస్పీ గండ్ర నళిని బీజేపీలో చేరారు. మొత్తం 184 మందితో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు ఈటల. అనంతరం హైదరాబాద్కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈటల బీజేపీలో చేరిక పూర్తవడంతో ఇక హుజురాబాద్ ఉపఎన్నిక పైనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. బీజేపీ నేతలతో కలిసి ఉపఎన్నికకు సంబంధించిన వ్యూహాలు రచించనున్నారు. కొద్దిరోజుల్లోనే ఈటల సహా బీజేపీ టీమ్ హుజురాబాద్లో మకాం వేసే అవకాశం ఉంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఓడిస్తే రాజకీయంగా ఈటల స్టేటస్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం బీజేపీలోనూ ఆయన పట్ల చిన్నచూపు ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి హుజురాబాద్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఈటల భావిస్తున్నారు. మరోవైపు హుజురాబాద్లో గెలుపు తమదేనని... ఈటల ఏం చేసినా అక్కడ ఓటమి తప్పదని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ క్రియేట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్లో గులాబీ జెండా ఎగిరితే కేసీఆర్ నాయకత్వానికి తెలంగాణలో తిరుగులేదన్న సంకేతాలు వెళ్తాయి.ఒకవేళ ఓడితే మాత్రం టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి బీజేపీకి అవకాశం ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications