కేసీఆర్ ఇకనైనా బయటకు రా.. ప్రజల పరిస్థితులు చూడు.. ఆస్పత్రులన్నీ తిరుగుదామంటూ భట్టి సవాల్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా బయటకు రావాలని... ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దేనికి లోటు లేదని చెబుతున్నారని... ఒకసారి తనతో వస్తే ఆస్పత్రులన్నీ తిరుగుదామని సీఎంకు సవాల్ విసిరారు. ఒక బాధ్యతగల అధికారి ఇలాంటి పరిస్థితుల్లో అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో అన్నీ బాగుంటే ఖమ్మంలో ఆస్పత్రి ఎదుట అంబులెన్సులు ఎందుకు వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ప్రశ్నించారు.

సీఎం అపాయింట్మెంట్ కోరుతున్నా : భట్టి విక్రమార్క
ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకునే మీ లాంటి అధికారులు ప్రజా సేవ చేయకుండా ఏం చేస్తున్నారని సీఎస్ను నిలదీశారు. సీఎం ఇకనైనా బయటకు రావాలని... అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా మీద అంతా కలిసి ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. సీఎంతో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరుతున్నట్లు చెప్పారు.ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడిగామని తెలిపారు.

ప్రైవేట్ ఫీజులు నిర్ణయించండి : భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు ఉన్న చోట టెక్నీషియన్లు లేరని... ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏడాది క్రితమే ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఫీజులు నిర్ణయించాలని... కార్పోరేట్ ఆస్పత్రులు సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తాగుతున్నాయని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరోనా బాధితులు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. బెడ్లు ఉంటే ఇంజెక్షన్లు లేవు... ఇంజెక్షన్లు ఉంటే ఆక్సిజన్ లేని పరిస్థితి నెలకొందన్నారు. 'టెస్టులు లేవు... వ్యాక్సిన్ లేదు... తెలంగాణ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది...' అని వాపోయారు.

అప్పట్లో కేసీఆర్ ప్రధానిగా ఉండి ఉంటే..
ఆరోగ్య శాఖను సీఎం దగ్గర పెట్టుకుని ఏం సమీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. ఏడాది క్రితం సీఎం నియమించిన కోవిడ్ టాస్క్ఫోర్స్ అసలు ఉందా... అది పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు కూడా టాస్క్ఫోర్స్ నివేదిక ఇస్తుందని సీఎం చెప్పారని... కానీ ఇప్పటివరకూ తమకు నివేదిక అందలేదని అన్నారు. ఇలాంటి దుస్థితి నెలకొన్నా ప్రభుత్వం ఇంకా నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన సమయంలో... అర్ధాంతరంగా ఆరోగ్యమంత్రిని తొలగించడమేంటని ప్రశ్నించారు.
అప్పట్లో పోలియో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడి మరీ పోలియో చుక్కలు వేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒకవేళ కేసీఆర్ లాంటి వాళ్లు అప్పట్లో ప్రధానిగా ఉండి ఉంటే... దేశంలో సగం మంది వైకల్యంతో బాధపడేవారని విమర్శించారు.












Click it and Unblock the Notifications