అవసరమైతే ఉద్యమమే-ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకోవాలి : భట్టి విక్రమార్క
తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవసరమైతే దీనిపై ఉద్యమం చేపడుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాజాగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్ను కలిసి భూముల అమ్మకాలను నిలుపుదల చేయాలని కోరుతామన్నారు. ఆదివారం(జూన్ 13) వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సీఎల్పీ అత్యవసర సమావేశంలో భట్టి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ విక్రయించిన భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా భూముల అమ్మకాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విక్రమార్క గుర్తుచేశారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి ప్రస్తావిస్తూ... తెచ్చిన అప్పులను ఇష్టానుసారంగా,జవాబుదారీతనం లేకుండా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు రాష్ట్రానికి చాలా ప్రమాదకరంగా పరిణమించాయన్నారు.

కాగా,తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ నెల 15న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. బిడ్ రిజిస్ట్రేషన్లకు జులై 13 చివరి తేదీ కాగా... అదే నెల 15వ తేదీన వేలం ప్రక్రియ జరగనుంది.
ప్రభుత్వ భూముల అమ్మకాల్లో భాగంగా హైదరాబాద్ శివారు కోకాపేటలో 49.95 ఎకరాలు,ఖానామెట్లో 15.1 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించనున్నారు. కోకాపేట ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం వేయనుండగా... ఖానామెట్ భూములను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నారు. జిల్లాల పరిధిలో ప్రజా అవసరాలకు ఉపయోగపడని భూములను కలెక్టర్లు సేకరించాల్సి ఉంటుంది. కనీసం వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూముల గుర్తింపుతో పాటు అభివృద్ధి, వేలానికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేసింది.వేలం నిర్వహణ బాధ్యతను నోడల్ ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం... ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటుచేసింది. వేలం ప్రక్రియలో పారదర్శకత,ప్రభుత్వ మార్గదర్శకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.












Click it and Unblock the Notifications