మిడ్ మానేరుకు హరీష్ రావు, సీఎం కేసీఆర్ అరగంటకోసారి..
హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మహారాష్ట్ర నుంచి వరద నీరు వస్తోంది. దీంతో మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మిడ్ మానేరు డ్యాంకు గండి పడినట్లుగా తెలుస్తోంది.
దీంతో మంత్రి హరీష్ రావు వెంటనే మిడ్ మానేరు బయలుదేరారు. రెవెన్యూ అధికారులను, ఇతరులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి అరగంటకు ఓసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. మంత్రి హరీష్ రావు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మిడ్ మానేరుకు కలెక్టర్ నీతు ప్రసాద్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి విడుదల
లోయర్ మానేరు డ్యాం నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు కాకతీయ కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడిచారు. డ్యాం నీటిమట్టం 11 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. సాయంత్రం వరకు నీటివిడుదలను 4 వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మీడియా అతి చేయవద్దు: కేసీఆర్
హైదరాబాదులో కురిసిన తాజా వర్షాలకు ఒక్కరు కూడా మరణించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక్కడి పరిస్థితిని ప్రసార మాధ్యమాలు అతిగా చూపి నగరానికి చెడ్డ పేరును తెస్తున్నాయన్నారు. భాగ్యనగరిలో అంతటి భయంకర పరిస్థితులేమీ లేవన్నారు.
వర్షాలపై ఆదివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించిన కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్ రావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మలతో మాట్లాడారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చిందని, ఈ సీజన్ ఖరీఫ్, రబీకి పూర్తిగా నీరందించవచ్చని అధికారులు వివరించారు.
గోదావరిలో నీటి ఉద్ధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేసీఆర్ సూచించారు. వాస్తవ పరిస్థితిని మాత్రమే మీడియా చూపాలని హితవు పలికారు. అతిగా చెప్పి, చూపి ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన కలిగించ వద్దని సూచించారు.