మునుగోడులో గెలుపెవరిది - ఉత్కంఠ పెంచుతున్న సర్వేలు..!!
మునుగోడులో ఏం జరుగుతోంది. ఉప ఎన్నికలో గెలిచేదెవరు. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చుండూరులో భారీ బహిరంగ సభ ద్వారా ఒటర్లను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయనున్నారు. 30న జరిగే బహిరంగ సభ కోసం దాదాపు లక్ష మందిని సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు - ఎమ్మెల్యేలు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి..కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యంగా విమర్శల జోరు పెంచారు. కేసీఆర్ బహిరంగ సభల..ప్రసంగం పైన ఉత్కంఠ పెరుగుతోంది. అటు బీజేపీ ప్రచార హోరును పెంచింది. ఈ నెల 31న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడుకు వస్తున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
నవంబర్ 1న మునుగోడు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రెండు సభల సమయంలోనే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ లో ఉండనున్నారు. ఇక, మునుగోడు ఉప ఎన్నిక సర్వే ఫలితాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎవరికి వారు తామే గెలిచేది అని చెబుతున్నా..లోలోపల మాత్రం నివేదికల్లోని అంశాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డి ఆసక్తి కర ట్వీట్ చేసారు. అందులో..'నాన్నా.. నిన్ను చూసి గర్వపడుతున్నా, మొత్తం అసెంబ్లీనే మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి మీరు తీసుకొచ్చారు, ఇప్పటికే మునుగోడు ప్రజలు విజయం సాధించారు' అంటూ రాజగోపాల్రెడ్డి తనయుడు సంకీర్త్రెడ్డి ట్వీట్ చేశారు.
'అధికార టీఆర్ఎస్ నుంచి 84మంది ఎమ్మెల్యేలు, 16మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 8 నుంచి 10 మంది ఎంపీలు, అంతులేని సంపద, పోలీసు పవర్తో ఒక వ్యక్తి(రాజగోపాల్రెడ్డి)ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ప్రజలు గెలిపించారు' అని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి జ్వరం కారణంగా ఒక రోజు ప్రచారానికి దూరమయ్యారు. కొన్ని సర్వే సంస్థలు మునుగోడు బై పోల్ కు సంబంధించి ఒపీనియన్ పోల్ లో మూడు పార్టీల మధ్య హోరా హోరీ తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఒక సర్వే సంస్థ రెండు ప్రధాన పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుందని వెల్లడించింది. కానీ, కాంగ్రెస్ కోసం పని చేస్తున్న ఒక ప్రముఖ సర్వే సంస్థ..పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, చివరి నిమిషంలో కొత్త సమీకరణాలకు అవకాశం ఉందంటూ అంతర్గతంగా నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ప్రధానంగా ఇక్కడ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తోంది. దీంతో..మునుగోడు ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.