చేనేత కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్-త్వరలోనే దళితులకు మరో పథకం-ఆరు నూరైనా దళిత బంధు ఆగదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భీమా తరహాలో చేనేత భీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని... దానికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపారు. అంతేకాదు,భవిష్యత్తులో దళితుల కోసం ప్రత్యేక భీమా సౌకార్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ మేరకు దళిత సంక్షేమ శాఖ కసరత్తులు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్కు చెప్పినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

పెద్దిరెడ్డిపై కేసీఆర్...
'పెద్దిరెడ్డి నాకు సన్నిహిత మిత్రుడు... ఇద్దరం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కలిసి పనిచేశాం. ఆయన కార్మిక విభాగంలో అధ్యక్షులుగా ఉంటూ కార్మిక శాఖ మంత్రిగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న ప్రగతి ప్రస్థానంలో వారి చేదోడు వాదోడు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దిరెడ్డితో పాటు చేనేత వర్గానికి చెందిన స్వర్గం రవి,ఆ వర్గానికి చెందిన ఇతర నేతలు కలిసిరావడం సంతోషం.' అని కేసీఆర్ పేర్కొన్నారు. చేనేత వర్గానికి ఇంకా చేయాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు భీమా తరహాలో చేనేత కార్మికులకు ప్రత్యేక భీమా సదుపాయం కల్పించబోతున్నట్లు ప్రకటించారు.

దళితుల కోసం దళిత భీమా పథకం...
'ఈమధ్య వర్క్ షాప్లో మాట్లాడుతుంటే దళితులకు కూడా భీమా సదుపాయం కల్పించాలనే సూచన వచ్చింది. అయితే ఇది చేయడానికి సమయం పడుతుంది. రైతు సంక్షేమం కోసం రైతు భీమా పథకాన్ని అమలుచేయడానికి ఒక సంవత్సరం పట్టింది. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి... అందులో రైతుల వివరాలు సేకరించి జాగ్రత్తగా దాన్ని అమలుచేయడం జరిగింది. ప్రస్తుతం చేనేత కార్మికుల భీమా సదుపాయం కోసం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దళిత సంక్షేమ శాఖ కూడా ఆ ఏర్పాట్లలో ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్తో చెప్పాం.' అని కేసీఆర్ తెలిపారు.

ఆరు నూరైనా దళిత బంధు ఆగదు...
'తరతరాలుగా దోపిడీ,వివక్షకు గురైన జాతి దళిత జాతి.వాస్తవానికి దళిత బంధు ఏడాదిన్నర ముందే మొదలుకావాలి. కరోనా రావడం వల్ల ఏడాది ఆలస్యమైంది. ఎక్కడో చోట ప్రారంభించాలని చెప్పి ఇటీవలే దాన్ని ప్రారంభించాం. చాలామంది దళితులకు ఆస్తులు లేవు... విద్య ఇప్పుడిప్పుడే అందుతోంది... దానికి తోడు వివక్ష,పేదరికం వెంటాడుతోంది. కాళ్లు,చేతులు మాత్రమే ఆస్తులుగా లక్షలాది దళిత కుటుంబాలు ఉన్నాయి. దళిత బంధు పథకాన్ని చూసి అదేదో బాంబులా కొంతమంది అదిరిపడుతున్నారు. ఆరు నూరైనా ఆ పథకం ఆగదు... 100శాతం అమలుచేసి తీరుతాం. ఏడాదికి ఎన్ని లక్షల కుటుంబాలకు ఆ పథకం అందించాలనేది త్వరలోనే నిర్ణయిస్తాం.' అని కేసీఆర్ వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే..
'తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... మొదట మిగతా వర్గాల సమస్యలను పరిష్కరిస్తూ ఇప్పుడు దళితుల వద్దకు వచ్చాం. రాష్ట్రంలో 19శాతం జనాభా దళిత ఉంది. అవసరమైతే వారి కోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు పెడుతాం.రాష్ట్రంలో ఎవరైతే వివక్షకు గురైనారో,సంక్షేమ ప్రగతి ఫలాలను అందుకోలేదో వారి కోసం కార్యక్రమాలు అమలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవు. ఉన్నా అరకొరా మాత్రమే. ఇంత పకడ్బందీగా... తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయి. కొన్ని కార్యక్రమాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. ఇవన్నీ హడావుడిగా తీసుకున్న నిర్ణయాలు కాదు.' అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమే...
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమని... మున్ముందు మరింత అభివృద్ది సాధిస్తుందని అన్నారు. ఇప్పటికే వెల్లువల పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. జాతీయ సగటు కంటే రాష్ట్ర జీఎస్డీపీ చాలా ఎక్కువ అన్నారు. తలసరి ఆదాయంలో కర్ణాటక తర్వాత తెలంగాణ టాప్ 2గా ఉందన్నారు. ఫించన్లు,రైతు బంధు,రైతు భీమా,ఉచిత కరెంట్,అమ్మ ఒడి,కేసీఆర్ కిట్,కల్యాణ లక్ష్మీ,ఆశావర్కర్లు,హోంగార్డులు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు,తదితర పథకాలు,కార్యక్రమాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయని చెప్పారు. ఈ పథకాలు చూసి తెలంగాణకు పొరుగునే ఉన్న మహారాష్ట్ర గ్రామాలు తమను కూడా రాష్ట్రంలో కలపాలని గతంలో డిమాండ్ చేశాయని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications