దుబ్బాక ఓటమి గుణపాఠం -సాగర్ ప్రచారానికి సీఎం కేసీఆర్ -కారుకు పోటీ లేదన్న నోముల భగత్
తెలంగాణలో గడిచిన ఏడేళ్లుగా దాదాపు అన్ని ఎన్నికల్లో అప్రతిహతంగా విజయాలు సాధించిన టీఆర్ఎస్ పార్టీకి గతేడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి ఎదురుకావడం, ఆ ప్రభావం జీహెచ్ఎంసీ సాధరణ ఎన్నికల్లోనూ కనిపించడం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. నాటి తప్పులు పునరావృతం కాకుండా రాబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు.

సాగర్ అభ్యర్థి ప్రకటన వేళ..
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఈసారి కూడా టికెట్ నోముల కుటుంబానికే దక్కింది. నర్సింహయ్య తనయుడు నోముల భగత్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. ఇవాళే బీఫాం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సీఎం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దుబ్బాక ఓటమికి కారణమదే..
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పోటీ బీజేపీనే అనే సంకేతమిచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సీఎం కేసీఆర్ స్పందించారు. దుబ్బాకలో ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని కేసీఆర్ నేతలకు తెలిపారు. సాగర్ లో ఆ పొరపాటుకు తావు లేకుండా తనతో పాటు మంత్రి కేటీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటామన్న కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సాగర్లో కష్టపడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సాగర్ లో సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు..

అసంతృప్తులకు పదవులు..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నేతలంతా సమిష్టిగా పనిచేయాలని, పార్టీలో అంతర్గత విభేదాలు పక్కనబెట్టి అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సీఎం కేసీఆర్ చెప్పారు. టికెట్ ఆశించి బంగపడ్డ టీఆర్ఎస్ నేతలు చెన్నపరెడ్డి, కోటిరెడ్డిలు బీజేపీకి టచ్లో ఉన్నారని.. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో సదరు అసంతృప్త నేతలపైనా కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారని, చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్, కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..

ఊహించని అవకాశం.. మాదే విజయం..
సీఎం కేసీఆర్ తనకు ఈ అవకాశం ఇస్తారని ఊహించలేదని నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''నాగార్జునసాగర్లో మాకు ఎవరూ పోటీ కాదు, మాకు మేమే పోటీ'' అని ప్రకటించారు. కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని, అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలుపు టీఆర్ఎస్ దే అని భగత్ స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు నోముల నర్సింహాయ్య ఏం చేసారన్నది ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications