ఇదీ కేసీఆర్ వ్యూహం: విపక్షం ఊపిరి పీల్చుకోవద్దు.. ఇక ఎన్నికలే ఎన్నికలు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో విపక్షాలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా దెబ్బ కొట్టాలని అధికార పక్షం, ప్రత్యేకించి సీఎం కే చంద్రశేఖర్ రావు తలపోస్తున్నారు. అందులో భాగంగా వచ్చేనెలలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు. అయితే పంచాయతీలు ఖచ్చితంగా ఐదేళ్ల పదవీ కాలంలో కొనసాగించాల్సి ఉన్నందున.. అప్పటివరకు కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నది. కొత్తగా ఎన్నికైనవారు శిక్షణ, క్షేత్ర అవగాహన పూర్తి చేసుకొని.. పాత పాలకవర్గాల పదవీకాలం ముగిశాక ఆగస్టు 1వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టేలా చర్యలు చేపడితే చాలునని భావిస్తోంది.
తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని అధికార టీఆర్ఎస్ భావిస్తున్నది. ఈ క్రమంలో సహకార సంఘాల పదవీ కాలాన్ని మరో ఏడాది కాలం పొడిగించే విషయమై మంగళవారం కలెక్టర్లతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా రూపొందించినందున దానిపై చర్చించి, ఆమోదించేందుకు ఈ నెల 22న కేబినెట్, 23, 24 తేదీల్లో అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
జూలై 31తో పంచాయతీల గడువు ముగింపు
ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 31వ తేదీతో ముగియనున్నది. అయితే అంతకంటే మూడు నెలల ముందే ఎన్నికలను నిర్వహించుకునే వెసలుబాటు చట్టంలో ఉంది. ఈ మేరకు ముందస్తు పంచాయతీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని సర్కారు భావిస్తోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను శనివారం రాత్రి సీఎం కేసీఆర్కు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన కసరత్తును వీలైనంత త్వరగా పూర్తిచేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధినాయకత్వం ఉన్నది. తొలుత షెడ్యూల్ ప్రకారం 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలకు వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
నిర్ణీత గడువులోపే 'పంచాయతీ'కి సీఎం కేసీఆర్ మొగ్గు
కానీ, సీఎం కేసీఆర్ మాత్రం నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందుకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాంకేతిక ప్రక్రియ పూర్తవుతుందా? లేదా? చట్టం అనుమతిస్తుందా? అనే విషయంలో అధికార వర్గాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణ కసరత్తులో నిమగ్నమైనందున.. ప్రభుత్వం తలచుకుంటే ఫిబ్రవరి రెండో వారంలో కష్టమేమీ కాదనే అభిప్రాయం కూడా ఉంది. పైగా ఎన్నికల ప్రక్రియను పది రోజుల్లోనే ముగించాలనుకుంటున్న నేపథ్యంలో ఇతరత్రా ఇబ్బందులు కూడా ఉండబోవనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. నూతన పంచాయతీరాజ్ చట్టం అసెంబ్లీ ఆమోదం పొంది, అమల్లోకి వచ్చేదానిని బట్టి పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారు కానున్నాయి.
రేపు కలెక్టర్ల సదస్సు
గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఎన్నికైన నాటినుంచి ఐదేళ్లు అధికారంలో విధిగా కొనసాగాలని చట్టం చెబుతోంది. దీంతో ప్రస్తుత పాలకవర్గాలను పదవీకాలం గడువు (జూలై 31) వరకు కదిలించకుండా కొనసాగించాలని, ఆ లోగా కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. తద్వారా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించినా చట్టపరమైన చిక్కులేమీ ఉండబోవని అంచనా వేస్తోంది. కాగా, సీఎం కేసీఆర్ ఈ నెల 16న (మంగళవారం) ప్రగతి భవన్లో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు.
కలెక్టర్ల సదస్సులో 'పాస్' పుస్తకాల పంపిణే ఏజెండా
భూముల రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ అజెండాగా నిర్వహించనున్నకలెక్టర్ల సదస్సులో మార్చి 11న 'ధరణి' కార్యక్రమం కింద చేయతలపెట్టిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. పంచాయతీరాజ్ నూతన చట్టం, గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహాలు వంటి అంశాలు కూడా కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. తండాల వారీగా జనాభా ఖరారు చేసి వాటికి చట్టపరంగా గ్రామ పంచాయతీ హోదా కల్పించటానికి రంగం సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు.
ఆరు నెలల పాటు సహకార సంఘాల పదవీకాలం పొడిగింపు
సహకార సంఘాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి వచ్చేనెల మొదటి వారంతో సహకార సంఘాల పదవీకాలం ముగుస్తుంది. కానీ, ప్రభుత్వం ఎలాగూ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుండటంతో, సహకార సంఘాల ఎన్నికలపై ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగించకుండా, వాటికి ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు.