సీఎం కేసీఆర్ ఇక తేల్చేస్తారా - ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటన పైన రంగం సిద్దం చేసుకున్న ఆయన..రాష్ట్రపతి ఎన్నికల వేళ చిన్న గ్యాప్ ఇచ్చారు. నేడు నూతన రాష్ట్రపతి గా ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో..తిరిగి ఢిల్లీ కేంద్రంగా తిరిగి సీఎం కేసీఆర్ కార్యాచరణ అమలుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా.. విపక్ష పార్టీల నేతలతో ముందుగా కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఉప రాష్ట్రపతి విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.

హస్తిన కేంద్రంగా సీఎం కేసీఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా విపక్షాలు ప్రకటించగా.. నామినేషన్ దాఖలు చేసారు. విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా దక్షిణాదికి చెందిన మహిళా అభ్యర్ధిని ఉప రాష్ట్రపతి రేసులో నిలబెట్టారు. దీంతో..కాంగ్రెస్ వ్యక్తికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. విపక్ష నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ తన వైఖరి పైన క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో విపక్ష పార్టీల్లో కీలకమైన టీఎంసీ తాము మద్దతు ఇవ్వలేమని చెబుతూ..తటస్థంగా ఉండాలని నిర్ణయించింది.

పార్టీ ముఖ్య నేతలు సైం ఢిల్లీకి
సీఎం కేసీఆర్ సైతం అదే నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, విపక్ష నేతలతో భేటీ తరువాతనే కీలకం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక..జాతీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. పార్టీ ముఖ్య నేతలు సైతం సీఎంతో పాటుగా ఢిల్లీలో ఉండనున్నారు. అనేక మంది మేధావులు..వివిధ రంగ నిపుణులతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కేంద్రం తీరును వారంతా తప్పు బడుతూ సీఎం కేసీఆర్ అభిప్రాయాలతో ఏకీభవించారు.ఈ పరిస్థితుల్లో.. అటు ఢిల్లీ ..ఇటు హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వరుస సమావేశాలకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం.

కీలక మంతనాలు- ప్రకటనకు ఛాన్స్
ఈ పర్యటనలో రిటైర్డ్ బ్యూరోక్రాట్లు.. పలు రంగాల్లో పని చేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ లతో భేటీ కానున్నట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణలోనూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో..తన రాజకీయ వ్యూహాలను మరింత వేగంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఓడిస్తామంటూ కేసీఆర్ శపధం చేసారు. అందులో బాగంగా.. కలిసొచ్చే పార్టీలతో మంతనాలు ఈ పర్యటనలో కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications