మునుగోడు అభ్యర్ధిపై తేల్చేసిన సీఎం కేసీఆర్ - సస్పెన్షన్ ఎత్తివేత..!!
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు బై పోల్ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ నుంచి రాజగోపాల్ పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. అధికార టీఆర్ఎస్ లో అభ్యర్ధి ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీశ్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేల తో సీఎం కేసీఆర్ చర్చలు చేసారు. ఇక, తాజాగా నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ అభ్యర్ధి అంశం పైన క్లారిటీ ఇచ్చారు.
ఆశలు పెట్టుకోవద్దంటూ
అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఎవరికివారే ఊహించుకొని ఆశలు పెట్టుకోవద్దని ఆశావాహులకు సూచించారు. ఆశావాహులు చాలా మంది ఉంటారని.. గెలుపు గుర్రానికే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. అన్ని విధాలుగా కసరత్తు చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని, సరైన సమయంలో ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థిని గెలిపించేందుకు స్థానిక నేతలు కష్టపడి పనిచేయాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నించవద్దని సూచించారు. పార్టీ అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పిన సీఎం కేసీఆర్..ఎవరికి వారు తామే అభ్యర్థి అనుకోవద్దని సూచించారు.
గెలిపించుకునే పూర్తి బాధ్యత పార్టీమీదే
అభ్యర్థి ఎవరైనా గెలిపించుకునే పూర్తి బాధ్యత పార్టీమీదే ఉంటుందన్నారు. 2014లో గెలిచిన పార్టీ 2018లో కొద్ది తేడాతో ఓడిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహనతోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. కృష్ణారెడ్డి మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. వారిని సీఎం పిలపించి మాట్లాడటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అభ్యర్థి ఎంపికపై సర్వేలు సాగుతున్నాయని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సమాచారం. పార్టీ అభ్యర్థి విజయంలో కంచర్ల సోదరులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి సూచించారు.
బహిరంగ సభ సక్సెస్ చేయండి
కృష్ణారెడ్డికి మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 20న జరిగే సభ విజయవంతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన వేనేపల్లి వెంకటేశ్వర్రావు ముఖ్యమంత్రిని కలిసారు. గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆయన 2014లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి లో విజయానికి కృషిచేశారు. 2018 లో టికెట ఆశించి రాకపోవటంతో.. నిరసనగా వేనేపల్లి భారీసభ నిర్వహించారు. దీంతో పార్టీ ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసిందది. కాగా, ఇప్పుడు సీఎం కేసీఆర్ వెంకటేశ్వర్రావును పిలిపించి, సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో సముచిత స్థానమిస్తామని, ఉపఎన్నికలో పార్టీఅభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు.