బీజేపీ దెబ్బకు గులాబీ బాస్ కేసీఆర్ అలెర్ట్ .. పార్టీ పై ఫోకస్ .. జిల్లాల పర్యటనకు శ్రీకారం!!
తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారా ? అందులో భాగంగా ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారా ? సొంత జిల్లా సిద్దిపేటలో పర్యటన మొదలుపెట్టిన కేసిఆర్ అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారా ? దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల దెబ్బకు గులాబీ బాస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారా , పార్టీపై ఫోకస్ చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

పార్టీపై దృష్టి సారించిన గులాబీ బాస్ కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగులేదని, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ లేదని ప్రశాంతంగా ఉన్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం, ఆ తర్వాత వరుసగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలతో పార్టీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, సమయం ఆసన్నమైందని భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి, అన్ని జిల్లాలలోనూ పర్యటించనున్నారని సమాచారం .

సిద్ధిపేట నుండి పర్యటన మొదలైనట్టేనా ?
పార్టీని బలోపేతం చేయడానికి జిల్లాలలోని నాయకులతో మాట్లాడి, దిశానిర్దేశం చేయనున్నారు. నేడు సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట నుండి తన పర్యటన మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. నేడు సిద్దిపేట జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్, అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు టిఆర్ఎస్ పార్టీ నేతలు.

టిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో కేసీఆర్
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటుగా, పార్టీని బలోపేతం చేయడానికి ప్రధానంగా కెసిఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
టిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్న కేసీఆర్ అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల కోసం శిక్షణ ఏవిధంగా నిర్వహించారో అదేవిధంగా అవసరమైన శిక్షణను పార్టీ కార్యకర్తలకు అందించాలని భావిస్తున్నారు.

సోషల్ మీడియా సైన్యాన్ని కూడా సిద్ధం చేసే పనిలో .. బీజేపీ దెబ్బకు అలెర్ట్ అయిన సీఎం
అంతేకాకుండా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా వారిని కూడా ప్రత్యేకంగా నియమించనుంది టిఆర్ఎస్ పార్టీ. రాష్ట్రస్థాయి నేతలకు కూడా శిక్షణ శిబిరాలను నిర్వహించి, ప్రజాక్షేత్రంలో ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్లాలి అని దిశా నిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇటీవల ఎన్నికల ఫలితాల తరువాత సీఎం కేసీఆర్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్లు గా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేయడంపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications