ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: డీఏ పెంపు, ఎంపీడీఓలకు 21ఏళ్ల తర్వాత పదోన్నతులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక విడత డీఏ(కరువు భత్యం) చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572శాతం డీఏ చెల్లించాలని ఉత్తర్వులపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. ఈ పెంపుతో 27.24శాతానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ చేరుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంపుపై ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీడీఓలకు పదోన్నతులు
రాష్ట్రంలోని 130మందికిపైగా ఎంపీడీఓలకు పదోన్నతులు లభించాయి. ఎంపీడీఓల పదోన్నతుల దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. 21ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎంపీడీఓలు ఎదురుచూస్తున్నారు. కాగా, పదోన్నతుల ఆకాంక్ష నెరవేర్చిన సీఎం కేసీఆర్, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావుకు ఎంపీడీఓలు కృతజ్ఞతలు తెలిపారు.