పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్, అడ్డుకున్నారంటూ బీజేపీ, మోడీపై ఫైర్
మహబూబ్నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శనివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. డెలివరీ సిస్టర్న్ వద్ద సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు నింపిన కలశాలకు వేద పండితులు పూజలు చేశారు. కలశాలను పలు గ్రామాల సర్పంచ్ లకు అందజేయనున్నారు.
కృష్ణా జలాలతో పలు గ్రామాల్లో దేవుళ్లకు ప్రజాప్రతినిధులు పూజలు చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (పీఆర్ఎల్ఐఎస్)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇవాళ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్లో అడ్డా కూలీ. కానీ ఇవాళ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. స్థానికులు ఇక్కడే తమ పొలాలు పని చేసుకుంటున్నారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రం ఇదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించాను. ఇది ఒక చరిత్ర. ఈ జిల్లా కిర్తికీరిటంలో శాశ్వతంగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకుని, మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకుని మూడు పెద్ద ప్రాజెక్టులు చేపట్టాం. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల.. ఈమూడు పూర్తయితే తెలంగాణ వజ్రం తునకలా తయారై దేశానికే అన్నం పెడుతాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు చకచక జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కూడా మూడు నాలుగేళ్ల కిందనే పూర్తయితుండే. కానీ మహబూబ్నగర్లో ఉండే గత్తర బిత్తర నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ఉండే దద్దమమ్మ రాజకీయ నాయకులు శత్రువులుగా మారి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు.

బీజేపీ నేతలపై విమర్శల వర్షం
కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నరు. ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం చేశాం అని కేసీఆర్ ప్రశ్నించారు. నేను ఒక్క మాట అడుతుతున్న బీజేపీ బిడ్డలను. మీకు సిగ్గూ శరం, చీమునెత్తురు, పౌరుషం ఉంటే.. పెద్ద సిపాయి పార్టీ అని మాట్లాడుతరు. పాలమూరుకు, తెలంగాణకు నీళ్ల గురించి కేంద్రాన్ని అడిగాం. కృష్ణా నదిలో వాటాతేల్చమని ప్రధాని మోడీని కోరాం. ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని, మా అంత సిపాయిలు అనే బీజేపీ, ఇక్కడ పెద్ద పెద్ద పోజులు కొట్టే నాయకులు మహబూబ్నగర్లో ఉన్నరు. వాటా తేల్చేందుకు పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్కు రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని లేఖ రాయించాలి. దానికి మోడీ కుయ్మనడు కైమనడు అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
సిగ్గులేని వీల్లు బీజేపీ జెండాలు పట్టుకొని ఇక్కడ తిరుగుతున్నరు. మీకు బుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కృష్ణా ట్రిబ్యునల్కు సిఫారసు చేయించాలి. మా వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. కేంద్రం పిలిపించి సుప్రీకోర్టు కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. ఏడాది అయినా అతీగతి లేదు. సిగ్గులేని బీజేపీ నాయకులు మేం జాతీయ ఉపాధ్యక్షులమంటూ అడ్డంపొడువు మాట్లాడుతున్నరు. ప్రజలు వారిని నిలదీయాలి. పాలమూరులో జరిగిన నష్టం చాలు. ఎవరైనా బీజేపీ నాయకులు జెండాలు పట్టుకొని వస్తే నిలదీయాలి. పదేళ్లు అవుతుందా? కృష్ణా ట్రిబ్యునల్కు సిఫారసు చేయడం లేదు' అంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.

కొల్లాపూర్కు వరాలు
కొల్లాపూర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. కొల్లాపూర్కు ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేస్తాం. రెండు, మూడు లిఫ్టులు అడిగారు. జిల్ దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవల్ కెనాల్, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్, లైనింగ్, మల్లేశ్వరం మినీ లిప్ట్ కావాలని అడిగారు. అధికారుల చేత సర్వే చేయించి తప్పకుండా మంజూరు చేస్తామని కేసీఆర్ చెప్పారు. రూ. 10 కోట్లతో బోడగట్టు చెక్ డ్యాంకు రేపే జీవో ఇస్తామన్నారు.
సర్పంచ్లకు తీపి కబురు చెబుతున్నాను. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున ప్రత్యేక ఫండ్ మంజూరు చేస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మహబూబ్నగర్ పట్టణంలో పెద్దగా ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. మహబూబ్నగర్ పట్టణంలో కూడా జేఎన్టీయూ ద్వారా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తాం. నన్ను ఎంపీగా చేసి, తెలంగాణను సాధించుకున్నాం. కాబట్టి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్ల చొప్పున ఎక్కువ ఇస్తాం. ఆర్డర్లు కూడా ఇచ్చాం. ఆ రకంగా నన్ను ఎంపీగా చేసి, తెలంగాణ సాధించేంత యోధుడిగా చేసినందుకు పాలమూరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది. భవిష్యత్లో కూడా మీ దీవెన ఉండాలని కోరుకుంటున్నాను అని కేసీఆర్ తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications