నిర్విఘ్నంగా చండీయాగం: హాజరైన వెంకయ్య, దత్తన్న
హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగం రెండు రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పూజలు, హోమాలు ప్రారంభమయ్యాయి.
యాగస్థలికి సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. చండీయాగంలో భాగంగా రెండోరోజు గురుప్రార్థన, గోపూజ, ఏకాదశ న్యాసపూర్వక ద్విసహస్ర చండీ పారాయణం నిర్వహించనున్నారు. ఈరోజు జరగనున్న నవావరణ పూజ, యోగినీ బలి, మహాధన్వంతరీ యాగం చేయనున్నారు.
ఈరోజు రాజశ్యామల యాగం, చతుర్వేద మహారుద్ర పునశ్చరణలు, మహాశౌరం నిర్వహిస్తారు. వీటితో పాటు ఉక్తదేవతా జపాలు, కుమారి, సువాసినీ, మహా మంగళహారతి, మధ్యాహ్నం 3 గంటల నుంచి ధార్మిక ప్రవచనం ఉంటుంది. సాయంత్రం కోటి నవాక్షరీ పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు ఉంటాయి.
సాయంత్రం శ్రీచక్రమండలారాధనం, అష్టవదానసేవ, ప్రసాద వినియోగం, రాత్రి 7:30 గంటలకు శ్రీరామలీల హరికథ కార్యక్రమం ఉంటుంది. 1,500 మంది రుత్విక్కులతో జరుగుతున్న యాగం మరో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ రోజు జరిగే చండీయాగానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
కాగా ఆయుత చండీయాగం జరిగే ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యాగాన్ని తిలకించేందుకు విచ్చేస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యాగశాల వద్ద 4వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
దాదాపు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.