నేడు సీఎం కేసీఆర్ ప్రకటన ఇదే - అసెంబ్లీ వేదికగా : పక్కా వ్యూహాత్మకంగా..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఒక వైపు జిల్లా పర్యటనలు చేస్తూనే..అక్కడే ప్రజల సమక్షంలో జాతీయ రాజకీయాల పైన ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో వనపర్తి సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. నిరుద్యోగులంతా రేపు (ఈ రోజు) ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారంటూ చెప్పారు. దీంతో..నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా లేక కొత్త ఉద్యోగాల ప్రకటన ఉంటుందా అనే చర్చ మొదలైంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా లక్ష ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఒకే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నే ఈ ఆర్దిక సంవత్సరంలోనే వీటిని భర్తీ చేసే విధంగా ప్రకటన ఉంటుంది తెలుస్తోంది. కొత్త నియామకాలకు ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 2022-23 బడ్జెట్లో రూ. 4,000 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఖాళీలతో పాటు కొత్తగా అవసరమైన పోస్టుల భర్తీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్త జోనల్ విధానం అమలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది.
ఉపాధ్యాయులు..పోలీసు కొలువులు
ప్రాధాన్యక్రమంలో నియామక ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు గురుకులాల్లో బోధన సిబ్బంది, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఇతర నియామకాలపై ప్రకటన చేయనుంది. స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయిస్తూ ప్రత్యేక క్యాలెండర్ను ముఖ్యమంత్రి వెల్లడించే ఛాన్స్ ఉంది. గురుకులాల్లోనే సుమారు 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలుగా టెట్ను డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీచర్ రిక్రూట్మెంట్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. 18,000 నుంచి 20,000 ఉపాధాయ పోస్టులు అవసరమని భావిస్తున్నారు.
కమిటీ సిఫార్సుల మేరకు
పరిపాలన సంస్కరణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ కూడా ఉద్యోగ ఖాళీలు, కొత్త నియామకాలు, అదనపు పోస్టులు తదితర అంశాలపై వివరాలను ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సర్కారు దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దమైంది. ఉద్యోగాల భర్తీ ప్రకటనకు రంగం సిద్దం చేసినట్లుగా సమాచారం. ఉద్యోగాల భర్తీతో పాటుగా.. నిరుద్యోగులకు భృతి అంశం పైనా సీఎం ఏం చెబుతారనే ఆసక్తి నెలకొని ఉంది.
Recommended Video
కేసీఆర్ పక్కా వ్యూహాత్మక అడుగులు
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు.. చేస్తున్న ప్రకటనలు ఎన్నికల ముందు సంసిద్దతలో భాగమా అన్నట్లుగా చర్చ సాగుతోంది. అయితే, ఉద్యోగాల భర్తీ గురించి ప్రకటన చేస్తూనే నిరుద్యోగ భృతి పైనా స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు రెండు అంశాల్లోనూ న్యాయం జరిగేలా ప్రకటన ఉండాలనే డిమాండ్లు మొదలు పెట్టారు. దీంతో..సభా వేదికగా సీఎం కేసీఆర్ చేయనున్న ప్రకటన పైన రాజకీయంగా..అదే విధంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతలోనూ ఉత్కంఠ పెరుగుతోంది.