భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం: సహాయక చర్యల వేగం పెంచాలంటూ సీఎం కేసీఆర్
హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీఎం ఆదేశాల మేరకు, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములౌతున్నారు.
హెలికాప్టర్ అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశం
ఈ నేపథ్యంలో ఊహించని వరదలకు జలమయమౌతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, రెస్క్యూ టీంలు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా వుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాపాడుతోంది.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ కేసీఆర్ ఆదేశాలు
భధ్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సీఎం .. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. దీంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సీఎం ఆదేశించారు.
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం
గోదావరి నది మహోగ్ర రూపానికి భద్రాచలం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వరద ప్రవాహం తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదకర స్థాయిని దాటడంతో.. భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీవ్ర హెచ్చరికల జారీతో ముంపు బాధితులంతా పునరావాసాలకు చేరుతున్నారు. ఇళ్ల వద్ద ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
భద్రాచలంలో 70 అడుగుకులకు చేరిన గోదావరి
కాగా, భద్రాచలంలో గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 70 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ నుంచి గోదావరిలోకి 23.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తుండటంతో ఇప్పటికే లోతట్టు కాలనీవాసులను పునరావాస కాలనీలకు తరలించారు.