మమత సమావేశం -కేసీఆర్ కీలక నిర్ణయం : కాంగ్రెస్ తో స్టాండ్ పై క్లారిటీ - తొలి అడుగు..!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశం పైన సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ పార్టీ ప్రకటన..విధి విధానాల పైన కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవ్వాలా వద్దా అనే అంశం పైన పార్టీ సీనియర్లతో సుదీర్ఘంగా చర్చించారు. తొలి నుంచి బీజేపీ..కాంగ్రెస్ కు సమ దూరం పాటించాలనే ఆలోచన విషయంలో కేసీఆర్ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. మమా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ను ఆహ్వానించడంతో ఈ సమావేశానికి దూరంగా ఉండాలని తుది నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ తో దూరం పాటించాలని నిర్ణయం
జాతీయ స్థాయిలో రాజకీయంగా క్రియా శీలకంగా వ్యవహరించాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్ అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ తో సంబంధం లేని పార్టీలు సత్సంబంధాలు కోరుకుంటున్నారు. దీంతో..ఇప్పుడు కాంగ్రెస్ హాజరయ్యే సమావేశంలో తాము పాల్గొనటం ద్వారా పార్టీ ఏర్పాటు వేళ ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో టీఆర్ఎస్ బృందాన్ని పంపాలని తొలుత భావించినా సుదీర్ఘ మంతనాల తర్వాత మొత్తానికే దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ ఈ సమావేశం ఏర్పాటు చేసారు.

తెలంగాణ రాజకీయాలపై ప్రభావం పడకుండా
జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా.. తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీకి టీఆర్ఎస్ సమదూరం పాటిస్తోంది. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సమావేశం నిర్వహించాలని మమతను సైతం కోరినట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ సైతం ప్రతిపక్షం కావటంతో ...బీజేపీ పైన పోరాటం ప్రారంభించిన సమయం నుంచీ..కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య పొత్తు అనే అంశాన్ని బీజేపీ నేతలు టీఆర్ఎస్ పైన విమర్శల కోసం అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి సమావేశంలో పాల్గొనటం ద్వారా తెలంగాణతో పాటుగా జాతీయ పార్టీ పైన ప్రభావం పడుతుందనే అంచనాకు వచ్చారు. పార్టీ నేతల సమావేశంలో మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వివరించిన సీఎం కేసీఆర్.. ఆ సమయంలోనే తాను రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరానని పార్టీ నేతలకు సీఎం వివరించినట్లు తెలిసింది.

ఆ రెండు రోజుల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందనను తెలుసుకోవాలని సూచించానని చెప్పినట్లుగా తెలుస్తోంది. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఖరారయ్యాక, తమను సంప్రదిస్తే మద్దతు విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్పై విమర్శలకు తావు ఇవ్వరాదనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బుధవారం జరిగే సమావేశం ప్రాథమిక భేటీ గానే పరిగణిస్తున్నారు. ఇక, ఈ నెల 19న జరుగుతుందని భావిస్తున్న రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఈ నెల 21 లేదా 22 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజున అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications