త్వరలో రాష్ట్రంలో కొత్త పథకమంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన: ఏడు బిల్లులకు ఆమోదం
హైదరాబాద్: త్వరలో తెలంగాణలో కొత్త పథకం ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లతాడారు. సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తామన్నారు.
నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి అవకాశం ఇస్తామని తెలిపారు.
త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాకే నిధుల వినియోగం పెరిగిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా వారు ఉద్యోగులం అనుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకునే అవకాశం పరిశీలిమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక ప్రతిపక్షాలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. టీఆర్ఎస్ వచ్చాకే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సంక్షేమంతో పాటు మూలధన పెట్టుబడులూ పెంచుతున్నామన్నారు.
అన్ని మతాలను గౌరవించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని.. అందుకే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు కేసీఆర్. ఎంతో చేశామని చెప్పుకొనే గత ప్రభుత్వాలు బోనాల పండుగను ఎనాడైనా పట్టించుకున్నాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బోనాల పండగకు రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. యాదాద్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.
2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు కాంగ్రెస్ పాలనలో ఎస్సీ వెల్ఫేర్ కోసం రూ. 6,198 కోట్లు ఖర్చు పెట్టారు. మేం ఏడేళ్లలోనే రూ. 23,296 కోట్లు ఖర్చు చేశాం. ఎస్టీ వెల్ఫేర్ కోసం రూ. 3430 కోట్లు ఖర్చు పెడితే, మేం రూ.14,447 కోట్లు ఖర్చు చేశాం. బీసీ వెల్ఫేర్ కోసం కాంగ్రెస్ రూ. 6593 కోట్లు ఖర్చు పెడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 19535 కోట్లు ఖర్చు చేశాం. మైనార్టీ వెల్పేర్ కోసం కాంగ్రెస్ రూ. 925 కోట్లు ఖర్చు చేస్తే, తాము రూ. 6971 కోట్లు ఖర్చు చేశాం. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కాంగ్రెస్ రూ. 4510 కోట్లు ఖర్చు చేస్తే, మేం రూ. 9916 కోట్లు ఖర్చు చేశాం. పదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 21,663 కోట్లు, టీఆర్ఎస్ సర్కార్ మాత్రం రూ. 74,165 కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
వ్యవసాయం రాదన్న ఏపీ నుంచి మనం విడిపోయాం. ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలుగా ఉంది. కేంద్రం తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణది రెట్టింపు. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తుంది? రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుంది. తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది.. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చేది కేవలం నాలుగైదు రాష్ట్రాలే. వాటిలో తెలంగాణ ఒకటి. కేంద్రం అసలు ఇస్తే కదా.. నిధులు మళ్లించడం జరిగేది. బీజేపీ నేతలు కేంద్రం నిధులిస్తుందన్న వాదన మానేయడం మంచిదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఏడు బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సమావేశాలు ముగిసిన అనంతరం సభకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీలో అన్ని అంశాలపై చర్చలు సజావుగా జరిగాయన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో అందరూ పని చేశారన్నారు. ఈ సారి వాకౌట్ లేకుండా సభ జరిగిందని మంత్రి తెలిపారు. ఐటీ, పురపాలక, మైనారిటీ సంక్షేమం, హరితహారం, పాతబస్తీ ప్రాంత అభివృద్ధి, దళితబంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.
ఏడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 37 గంటల 5 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఏడు రోజుల సమావేశాల్లో సభ్యులు 41 ప్రసంగాలు చేశారు. ఏడు బిల్లులను ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం చేశారు. 101 సభ్యులున్న టీఆర్ఎస్ 9గంటల 2 నిమిషాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి 11 గంటల 8నిమిషాల సమయం తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏఐఎంఐఎం పార్టీకి 5 గంటల 35 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి 3 గంటల 24 నిమిషాలు, బీజేపీకి 2 గంటల 3 నిమిషాల పాటు చర్చలో పాల్గొన్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications