నేడు పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన; కలెక్టరేట్ ప్రారంభోత్సవం; ఆపై పెద్దకల్వలలో బహిరంగసభ!!
పెద్దపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం పెద్దపల్లి పట్టణ శివారులోని పెద్దకల్వల వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

నేడు సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన... షెడ్యూల్ ఇలా
పెద్దపల్లి లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కేసీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దపల్లికి చేరుకుంటారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు, గౌరెడ్డి పేట శివారులో పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆపై పెద్ద కల్వలలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభలో సుమారు లక్ష మంది ప్రజలు పాల్గొంటారని టిఆర్ఎస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

పెద్దపల్లిలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ఇలా
పెద్దకల్వల సమీపంలోని 22 ఎకరాల ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయ స్థలంలో రూ.48.07 కోట్లతో అన్ని సౌకర్యాలతో పాటు ఆధునిక కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. జీ2 భవనంలో ఆరు బ్లాకులు మరియు 98 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 40 గదులు ఉండగా, మొదటి మరియు రెండవ అంతస్తులలో ఒక్కొక్క అంతస్తులో 29 గదులు ఉన్నాయి. పెద్దపల్లి కలెక్టరేట్లో మొత్తం 41 శాఖలకు కార్యాలయాలు కేటాయించారు. కలెక్టరేట్ ఆవరణలో సమావేశ మందిరంతో పాటు విశాలమైన పార్కింగ్ స్థలం, స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. పచ్చదనాన్ని కూడా అభివృద్ధి చేశారు.

అన్ని శాఖలు, క్యాంప్ కార్యాలయాలు ఒకేచోట.. సీఎం మీటింగ్ ఏర్పాట్లలో గులాబీ నేతలు బిజీ
జిల్లా మంత్రి, కలెక్టర్, అదనపు కలెక్టర్ మరియు అన్ని జిల్లా స్థాయి అధికారుల కోసం ప్రత్యేక ఛాంబర్లు కూడా నిర్మించారు. 6.58 కోట్లతో జిల్లా స్థాయి అధికారుల నివాస గృహాల నిర్మాణం కూడా చేశారు. ఇప్పటికే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు పూర్తిచేసి గృహప్రవేశాలు కూడా నిర్వహించారు. మరో ఎనిమిది మంది జిల్లా స్థాయి అధికారుల నివాసాలు కూడా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ బీ వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications