రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్..!! "గ్యాప్" తరువాత : అనూహ్య నిర్ణయం వెనుక...!!
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు సిద్దం అవుతున్న వేళ..వివాదాలకు ముగింపు పలికేందుకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా సుదీర్ఘ విరామం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి తో గవర్నర్ తమిళసై రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానునున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య గ్యాప్ ఏర్పడింది. దూరం పెరిగింది.

సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాలు ప్రారంభించటం తో వివాదం మొదలైంది. అయితే, ప్రభుత్వం ప్రోరోగ్ చేయని సమావేశాలను తిరిగి ప్రారంభించేందుకు గవర్నర్ ప్రసంగం అవసరం లేదని అప్పట్లోనే స్పష్టత ఇఛ్చింది. ఇక, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ పేరు తెలంగాణ కేబినెట్ సిఫార్సు చేసిన గవర్నర్ ఆమోదించ లేదు. దీని పైనా చర్చ జరిగింది. గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వటం లేదంటూ తమిళసై ఢిల్లీ పర్యటనలో వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ జిల్లాల పర్యటన..దేవాలయాల సందర్శన సమయంలోనూ ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వలేదని తమిళసై వాపోయారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. తెలంగాణలో పరిణామాలను వివరించారు.

గ్యాప్ తగ్గించేందుకు ముందడుగు
అదే సమయంలో రాజ్ భవన్ లో ఫిర్యాదు బాక్స ఏర్పాటు..తాజాగా మహిళా దర్భార్ నిర్వహించటం వంటివి సైతం టీఆర్ఎస్ నేతలకు రుచించలేదు. కొందరు గులాబీ నేతలు గవర్నర్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగినా సీఎంతో సహా ఇతరులు ఎవరూ హాజరు కాకపోవటంతో గ్యాప్ మరింతగా పెరిగినట్లుగా వాదనలు వినిపించాయి. అయితే, సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. బీజేపీతో పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఇతర వివాదాలకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ నిర్ణయం - వివాదానికి ఎండ్ కార్డ్ పడేనా
ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడా విమర్శలకు అవకాశం లేకుండా వ్యవహరించాలనే ఆలోచనలో భాగంగా.. తానే రాజ్ భవన్ కు వెళ్లటం ద్వారా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం అనే ప్రచారానికి ముగింపు ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా భావిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ అసలు రాజ్ భవన్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే సందిగ్దత నడుమ. .సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం కేసీఆర్ తన అన్న లాంటి వారంటూ గతంలో గవర్నర్ సైతం చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లటం ద్వారా కొద్ది రోజులుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికినట్టేనని ఇప్పటికే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications