సీఎం కేసీఆర్ కు అస్వస్థత; యశోదా ఆస్పత్రికి కేసీఆర్, యాదాద్రి పర్యటన రద్దు
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురవడంతో ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్ళవలసిన యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈరోజు సీటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వెల్లడించారు. డాక్టర్ ఎన్వి రావు నేతృత్వంలోని వైద్యుల బృందం సీఎం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి వీక్ గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతుంది అని చెప్పారని వైద్యులు వెల్లడించారు. అందుకే ఆయనకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ఎన్వి రావు పేర్కొన్నారు.
యాదాద్రి లో నేడు జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరు కల్యాణోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. సీఎం కేసీఆర్ యాదాద్రి స్వామి తిరు కల్యాణోత్సవ వేడుకలకు హాజరవుతారని ఈవో గీత వెల్లడించారు. కానీ ఆయన అస్వస్థతకు గురవడంతో కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
Recommended Video
ఇదిలా ఉంటే ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని విషయం తెలిసి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఉప్పల్ నుంచి నేరుగా యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై, నిర్వహిస్తున్న పరీక్షలపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.